అక్షరటుడే, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (TPCC working president), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేందుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముందుగానే ప్రజలకు అప్పీలు పెట్టుకున్నారని అన్నారు. రేవంత్ దిగిపోయాక తాను సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు.
గురువారం(జూన్ 26) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సర్కారును అధికారంలోకి తీసుకొచ్చి, రేవంత్ సీఎం అయ్యేందుకు చూస్తున్నట్లు తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక (తొమ్మిదేళ్ల తర్వాత) సీఎం అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
Jagga Reddy : రైతుభరోసా..
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సూపర్గా కొనసాగుతోందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. గతంలో రైతు బంధు డబ్బులు వేసేందుకు బీఆర్ఎస్ సర్కారు ఐదు నెలల సమయం తీసుకునేదని, కానీ కాంగ్రెస్ సర్కారు కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుభరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేసిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో నిధులు అందుబాటులో ఉన్నా.. వేయలేదని, కాంగ్రెస్ సర్కారు మాత్రం అప్పులు కడుతూ రైతు భరోసా డబ్బులు వేసిందన్నారు.
Jagga Reddy : ఫోన్ ట్యాపింగ్..
ఫోన్ ట్యాపింగ్ phone tapping వ్యవహారంపైనా జగ్గారెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కారు అంతా ఫోన్ ట్యాపింగ్తోనే నడిచిందని దుయ్యబట్టారు. నాడు తన ఫోన్ సైతం ట్యాప్ అయినట్లు పోలీసులు చెప్పినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేయడంపైనే దృష్టి పెట్టిన బీఆర్ఎస్.. గత పదేళ్ల పాలనను గాలికొదిలేసిందని ఎద్దేవా చేశారు.
Jagga Reddy : కవితపై ఘాటు విమర్శలు..
కేసీఆర్ KCR కుటుంబంపై సైతం జగ్గారెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. కేసీఆర్ గృహం డ్రామా కంపెనీగా మారిందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత (MLC KAVITHA) వ్యాఖ్యలు వింటుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కవితకు లేదన్నారు. రేవంత్, కేసీఆర్ ఒకేస్థాయి వారని, వారిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే ఒక అర్థం ఉంటుందని, వీరి మధ్యలో కవిత దూరడం సబబుగా లేదని అన్నారు. కేసీఆర్ కూతురుగా మినహా కవితకు అదనంగా అర్హతలు ఏమిటని జగ్గారెడ్డి నిలదీశారు.