అక్షరటుడే, వెబ్డెస్క్ : Israel | ఇరాన్– ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్ అణుశక్తి గల దేశంగా మారితే తమ ఉనికికే ప్రమాదం అని భావించిన ఇజ్రాయెల్ ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ (Operatin Rising Lion) పేరిట దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.
100కు పైగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకుపడింది. ఆ దేశంలోని అణు స్థావరాలు, ఆర్మీ కీలక నేతలు, న్యూక్లియర్ సైంటిస్టులే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో తన కుమారుడి వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Israel | విమర్శలు రావడంతో..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడు అవ్నర్, అమిత్ యార్దేనీకి సోమవారం వివాహం జరగాల్సి ఉంది. అయితే దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రధాని ఇంట్లో పెళ్లి ఏమిటని విమర్శలు వచ్చాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడుల సమయం నుంచే ఈ విమర్శలు ఉన్నాయి. గాజాలో ఐడీఎఫ్ దళాలు పోరాడుతుంటే.. ప్రధాని ఇంట పెళ్లి వేడుకలు ఏమిటని గతంలో సైతం పలు విమర్శలు చేశాయి. తాజాగా ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవి మరింత ఎక్కువ అయ్యాయి. దీంతో ప్రధాని తన కుమారుడి వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Israel | ఇరాన్ ప్రతిదాడులు
ఇజ్రాయెల్ తమ దేశంపై దాడి చేయడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశం వందల కొద్ది డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 (True Promise 3) పేరిట దాడులు చేపట్టింది. కాగా.. ఇరాన్ ప్రయోగించిన పలు డ్రోన్ల, క్షిపణులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకుంది. కొన్ని మాత్రం పలు ప్రాంతాల్లో పడడంతో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ దాడుల్లో ఆదివారం 10 మంది మరణించారని, 180 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు.