అక్షరటుడే, వెబ్డెస్క్: Ind – Pak Tensions | జమ్మూ కశ్మీర్లోని ఉగ్రదాడితో భారత – పాక్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. రెండు దేశాల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఉగ్రదాడి వెనుక పాక్ ఉందని భారత్ ఆ దేశంతో పలు ఒప్పందాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. వాణిజ్యంతో పాటు సింధు నది జలాల ఒప్పందాన్ని సైతం భారత్ నిలిపి వేసింది. దీంతో పాక్ సైతం ప్రతీకార చర్యలకు దిగింది. సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Ind – Pak Tensions | అప్రమత్తమైన సైన్యం
పాక్ తన బలగాలను అప్రమత్తం చేసింది. సరిహద్దు వెంబడి యుద్ధ విమానాలను మోహరించడంతో పాటు సైనికులకు సెలవులు రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా భారత సైన్యం కూడా పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. సెలవుపై వెళ్లిన జవాన్లు తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్ చేరుకున్నారు. శ్రీనగర్లో జమ్మూ కశ్మీర్లోని పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పహల్గామ్కు వెళ్లి పరిశీలించనున్నారు.
Ind – Pak Tensions | భారత్కు ఆ దేశ యుద్ధ విమానాలు
ఉగ్రదాడితో ప్రపంచ దేశాలు భారత్కు సంఘీభావం ప్రకటించాయి. ఆ దాడిని తీవ్రంగా ఖండించాయి. అయితే యుద్ద మేఘాలు అలుముకున్న తరుణంలో అమెరికాకు చెందిన ఎయిర్ఫోర్స్ విమానం భారత్కు రావడం గమనార్హం. ఇప్పటికే పాక్తో వైఖరి విషయంలో ట్రంప్ భారత్కు అనుకూలంగా ఉన్నారు. ఈ క్రమంలో యూఎస్ ఎయిర్ ఫోర్స్ విమానం జైపూర్లో ల్యాండ్ అయింది. మరోవైపు ఇజ్రాయిల్కు ఆర్మీకి చెందిన విమానాలు కూడా భారత్కు రావడం గమనార్హం.
Ind – Pak Tensions | వారిపై కఠిన చర్యలు
భారత్లో ఉంటూ దేశ వ్యతిరేకంగా సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే పాక్కు అనుకూలంగా మాట్లాడిన ఓ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. పాక్ అనుకూలంగా వీడియోలు, పోస్టులు పెట్టే వారిపై చర్యలు చేపట్టనున్నారు.