అక్షరటుడే, వెబ్డెస్క్: ACB Case | కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎస్సారెస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న నూనె శ్రీధర్ సంపాదించిన అక్రమాస్తులు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆయన ఆస్తులు చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. దాదాపు రూ. 200 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేల్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టు(Nampally ACB Court)లో ఇప్పటికే హాజరు పరిచారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు.
ACB Case | భారీగా అక్రమాస్తులు
ఏసీబీ అధికారులు కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్(Hyderabad) ప్రాంతాల్లోని శ్రీధర్కు సంబంధించిన ఇళ్లలో బుధవారం దాడులు చేశారు. శ్రీధర్, ఆయన బంధువుల ఇళ్లలో 13 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఈఈ శ్రీధర్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు.
వరంగల్లో 3 అంతస్తుల భవనం, మలక్పేటలో 4 అంతస్తుల భవనం, షేక్పేటలో స్కై హైలో 4,500 చదరపు అడుగుల ఫ్లాట్, తెల్లాపూర్లోని ఉర్జిత్ గేటెడ్ కమ్యూనిటీ(Urjit Gated Community)లోని విల్లా ఉన్నాయి. అలాగే 19 ఓపెన్ ప్లాట్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి ఆయన పేరిట ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు ఆభరణాలు(Gold jewelry), నగదు సీజ్ చేశారు. ఆయన సంపాదించిన అక్రమాస్తుల విలువ రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంకా సోదాలు నిర్వహించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.