అక్షరటుడే, వెబ్డెస్క్: Iran-Israel Ceasefire | ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల యుద్ధంతో రగిలిపోతున్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గనున్నాయి. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఆయన వ్యాఖ్యాలను ఖండించిన ఇరాన్ తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని తెలిపింది.
ఇజ్రాయెల్పై దాడి తర్వాత సీజ్ ఫైర్(Ceasefire ) అమలులోకి వచ్చినట్లు ప్రకటించడం గమనార్హం. కాల్పుల విరమణకు చివరి నిమిషం వరకు దాడులు జరుగుతూనే ఉంటాయని ఇరాన్(Iran) తెలిపింది. 12 రోజులు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరగ్గా.. ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి.
Iran-Israel Ceasefire | స్పందించని ఇజ్రాయెల్
సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందని, ఎవరూ ఉల్లంఘించొద్దంటూ ట్రంప్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలుత ఇరాన్, ఆపై ఇజ్రాయెల్(Israel) కాల్పుల విరమణ పాటిస్తాయని, 24 గంటల్లో ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయమై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. బంకర్లలో దాక్కున్న తమ దేశ పౌరులను బయటకు రావాలంటూ ఆదేశాలు మాత్రం జారీ చేసింది. దీంతో యుద్ధం ముగిసినట్లేనని తెలుస్తోంది. ఈ యుద్ధం ముగిస్తే 12 రోజులుగా రగిలిపోతున్న పశ్చిమాసియాలో శాంతి నెలకొననుంది.