అక్షరటుడే, వెబ్డెస్క్ : Iran-Israel Ceasefire | ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రకటించారు. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి సీజ్ఫైర్ ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగుస్తుందని వెల్లడించారు.
ఇరాన్ అణుశక్తి గల దేశంగా ఎదిగితే తమకు ముప్పు అని భావించిన ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్(Operation Rising Lion) పేరిట దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరాన్లోని అణు స్థావరాలు, శాస్త్రవేత్తలు, ఆర్మీ ఉన్నతాధికారులు లక్ష్యంగా టెల్అవీవ్(Tel Aviv) దాడులకు పాల్పడింది. అనంతరం ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై క్షిపణులు ప్రయోగించడంతో యుద్ధం మొదలైంది. రెండు దేశాలు దాడులు చేసుకుంటున్న క్రమంలో అమెరికా(America) సైతం అందులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని అణుస్థావరాలపై అమెరికా క్లస్టర్ బాంబులు(Cluster bombs) ప్రయోగించింది. అమెరికా తీరుతో ఆగ్రహంగా ఉన్న ఇరాన్ సోమవారం రాత్రి ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్లోని సైనిక స్థావరాలపై సైతం దాడులు చేసింది. ఈ క్రమంలో రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు ట్రంప్ ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుతం కొనసాగుతున్న మిషన్లను పూర్తి చేసుకునేందుకు ఇరాన్, ఇజ్రాయెల్కు కొంత సమయం లభించనుందని, అనంతరం ఈ కాల్పుల విరమణ దశలవారీగా అమల్లోకి వస్తుందని ట్రంప్ వివరించారు. 12 రోజుల యుద్ధానికి ముగింపు పలకడానికి ముందుకు వచ్చిన రెండు దేశాలను ఆయన అభినందిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Iran-Israel Ceasefire | కొట్టి పారేసిన ఇరాన్
కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ కొట్టిపారేసింది. ప్రస్తుతం అలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేసింది. ట్రంప్ ప్రకటనపై ఇజ్రాయెల్(Israel) ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం విషయంలో అనిశ్చితి నెలకొంది. కాగా అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేయడానికి ముందు కూడా ఇరాన్, ఇజ్రాయెల్లు మళ్లీ దాడులపై పరస్పరం బెదిరింపులు చేసుకోవడం గమనార్హం. మరోవైపు ఇరాక్, ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడంతో ఆయా దేశాల గగనతలాలను మూసివేశారు. అయితే ఇరాన్ జరిపిన దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా తెలిపింది.