అక్షరటుడే, వెబ్డెస్క్: IPL 2025 | భారత్, పాకిస్థాన్ మధ్య మొదలైన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) యుద్ధ సెగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)నూ తాకింది. గత కొద్ది రోజుల నుండి ఐపీఎల్ వాయిదా పడుతుంది అంటూ ప్రచారాలు సాగాయి. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ఈ లీగ్ను వాయిదా వేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. బాంబుల మోతతో సరిహద్దుల వద్ద ప్రజలు బిక్కుబిక్కుమంటుండగా దాయాది దేశంతో భారత సైనికులు వీరోచితంగా పోరాడుతున్న తరుణంలో ఐపీఎల్ నిర్వహణ సరికాదంటూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.18వ సీజన్ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.
IPL 2025 | వాయిదాల పర్వం..
మే 8 నాటికి ఐపీఎల్(IPL 2025)లో 58 మ్యాచ్లను నిర్వహించగా ఈ సీజన్లో మరో 12 లీగ్ మ్యాచ్లు, 4 నాకౌట్ మ్యాచ్లు మిగిలున్నాయి. ఐపీఎల్ 2008 లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి టోర్నమెంట్ సజావుగానే సాగుతుంది. అయితే గత 5 సంవత్సరాలలో బీసీసీఐ టోర్నమెంట్(BCCI Tournament)ను వాయిదా వేయవలసి రావడం ఇది మూడోసారి. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ మార్చి 22న ప్రారంభమైంది. అప్పటి నుంచి గత ఒకటిన్నర నెలల్లో టోర్నమెంట్లోని 57 మ్యాచ్లు పూర్తయ్యాయి. భారత్ -పాక్ మధ్య జరుగుతున్న యుద్ధం వలన వాయిదా వేయాల్సి వచ్చింది. ఐపీఎల్ 2020 చూస్తే.. తొలిసారిగా ఐపీఎల్ 2020 లో వాయిదా వేయాల్సి వచ్చింది. అప్పుడు టోర్నమెంట్ మార్చి 29 న ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనావైరస్ మహమ్మారి వలన భారత బోర్డు మార్చి 15న టోర్నమెంట్ను ఏప్రిల్ 14 వరకు వాయిదా వేసింది. తరువాత ఏప్రిల్ 15న నిరవధికంగా వాయిదా వేసింది. చివరకు, 174 రోజుల తర్వాత, 2020 సెప్టెంబర్ 19న, టోర్నమెంట్ యూఏఈలో పూర్తి చేశారు.
ఐపీఎల్ 2021 విషయానికి వస్తే బీసీసీఐ బయో-బబుల్(BCCI Bio-Bubble)లో టోర్నమెంట్ను నిర్వహించడం ప్రారంభించింది. టోర్నమెంట్ను 3-4 వేదికలలో మాత్రమే నిర్వహించారు. ఇది ఏప్రిల్ 9న ప్రారంభం కావాల్సి ఉండగా, రెండవ దశ కరోనావైరస్ కారణంగా, మే 2న జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఈ సమయంలో, కొంతమంది ఆటగాళ్ళు వైరస్ బారిన పడ్డారు. ఆ తరువాత రెండు మ్యాచ్లు కూడా వాయిదా వేశారు. చివరికి టోర్నమెంట్ మే 5న వాయిదా పడింది. చివరకు, 139 రోజుల తర్వాత, సెప్టెంబర్ 19న, మరోసారి టోర్నమెంట్లో మిగిలిన భాగాన్ని యూఏఈలో పూర్తి చేశారు. ఇలా ఐపీఎల్ మూడు సార్లు వాయిదా పడింది. తాజా సీజన్ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి.