అక్షరటుడే, వెబ్డెస్క్:IPL 2025 | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindoor) పేరిట పాకిస్థాన్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. మంగళవారం అర్థరాత్రి 1.44 గంటల సమయంలో భారత సైన్యం(Indian Army) జరిపిన ఈ దాడిలో సుమారు 80 మంది ఉగ్రవాదులు మరిణించినట్లు తెలుస్తోంది. 1971 తర్వాత భారత వైమానిక, నేవీ, ఆర్మీ కలిసి చేసిన ఆపరేషన్ ఇదే. అయితే ఈ దాడి కారణంగా భారత్-పాకిస్థాన్(Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాదీ దేశాల మధ్య యుద్దం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితులు ఐపీఎల్(IPL) 2025 సీజన్పై ప్రభావం చూపుతాయా? అనే సందేహం క్రికెట్ ప్రేమికులకు కలుగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ తుది దశకు చేరుకుంది. 56 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఈ నెల 25న జరిగే ఫైనల్తో ఈ సీజన్కు తెరపడనుంది. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లను ఆయా క్రికెట్ బోర్డులు వెనక్కిరప్పించే అవకాశం ఉంది. కొందరు ఆటగాళ్లు భయంతో స్వయంగా భారత్ను వీడే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ సజావుగా పూర్తవుతుందా? లేక రద్దవుతుందా? అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.
ఈ ఊహాగానాల నేపథ్యంలో బీసీసీఐ(BCCI) వర్గాలు స్పందించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ షెడ్యూల్(IPL Schedule) ప్రకారమే యాథావిధిగా కొనసాగుతుందని, ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) ప్రభావం మ్యాచ్లపై పడదని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ(ANI) తెలిపింది. అయితే పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రం పంజాబ్(Punjab)లో జరిగే మ్యాచ్లను మరో చోటికి తరలించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారత క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు మాత్రం ఆపరేషన్ సింధూర్ను సమర్థిస్తూ… సోషల్ మీడియా(Social Media) వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. భారత సైన్యంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.