అక్షరటుడే, అమరావతి: YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి(Andhra Pradesh former Chief Minister), వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YSRCP chief YS Jagan Mohan Reddy) భద్రత విషయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (Central Intelligence Bureau) ఏపీ హైకోర్టు (AP High Court) కు మంగళవారం కీలక నివేదికను సమర్పించింది. ఆయనకు ఎలాంటి ప్రాణహాని, ముప్పు లేదని ఇంలిటిజెన్స్ బ్యూరో నివేదికలో తెలిపింది.
ఏపీలో ప్రభుత్వం నుంచి దిగిపోయిన అనంతరం జగన్ భద్రతను కుదించారు. అయితే తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని హైకోర్టులో జగన్ గతంలో పిటిషన్ వేశారు. ఎన్ఎస్జీ లేదా సీఆర్పీఎఫ్ సిబ్బందితో సెక్యురిటీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు.. నివేదిక సమర్పించాలని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఐబీ నివేదికను సమర్పించింది. జగన్ పిటిషన్పై మంగళవారం హైకోర్టు మరోమారు విచారించింది.
ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న ప్రత్యేక న్యాయవాది జగన్ భద్రతను కుదించలేదని తెలిపారు. ఇప్పటికే 58 మందితో జగన్కు భద్రత కల్పిస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించలేదని పిటిషనర్ చెప్పిన వాదనలో వాస్తవం లేదన్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారమే భద్రతా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ కేసు విచారణను జులై 15వ తేదీకి వాయిదా వేసింది.