అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: GGH Nizamabad | నగరంలోని జిల్లా జనరల్ ఆస్పత్రి నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. రోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం నిత్యకృత్యమయ్యిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓవైపు ఆస్పత్రిలో అరకొర సౌకర్యాల కారణంగా రోగులు అవస్థలు పడుతుంటే.. వైద్యులు, సిబ్బంది ప్రవర్తన కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
GGH Nizamabad | ఆస్పత్రి ఆవరణలోనే..
జిల్లా ఆస్పత్రిలో వృద్ధురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించారని సీపీఐ ఎంఎల్ CPI ML (Prajapantha) జిల్లా కార్యదర్శి వి.ప్రభాకర్ ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కిట్ (Perkit) గ్రామానికి చెందిన బుజ్జమ్మను అనారోగ్యం కారణంగా ఈనెల 24న 108 సిబ్బంది జీజీహెచ్కు తీసుకొచ్చారు. అయితే ఆమె కాలికి పట్టి కట్టిన వైద్యసిబ్బంది ఆస్పత్రి ఆరుబయట పడుకోబెట్టారని ప్రభాకర్ ఆరోపించారు. సమాచారం అందుకున్న తాము ఆస్పత్రికి వెళ్లి చూడగా ఆస్పత్రి బయటే బుజ్జమ్మను ఉంచారని వివరించారు. ఆమెకు తోడుగా ఎవరూ లేరని.. ఆస్పత్రి సిబ్బంది ఇలా అమానుషంగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.