అక్షరటుడే, వెబ్డెస్క్: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Minister) అన్నారు. నిజామాబాద్ (Nizamabad) నగరంలో పసుపు బోర్డు (Turmeric Board) కార్యాలయం ప్రారంభించిన అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ (PM Modi) హామీ ఇచ్చారన్నారు. మోదీ మాట ఇచ్చారంటే తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. బోర్డు ఏర్పాటుతో ఇక ఎప్పటికీ పసుపు రేటు పడిపోదని అమిత్ షా పేర్కొన్నారు.
Turmeric Board inauguration | ఎగుమతుల కోసం ప్రత్యేక చర్యలు
పసుపు బోర్డు ద్వారా మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగు పరుస్తామన్నారు. పసుపు మార్కెటింగ్, ఎగుమతుల కోసం కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడు నాలుగు సంవత్సరాల్లోనే నిజామాబాద్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుందని చెప్పారు. ఆర్గానిక్ పసుపు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్కు కేంద్రం కృషి చేస్తోందన్నారు. భారత్ ఆర్గానిక్ కో ఆపరేటివ్ లిమిటెడ్ (Bharat Organic Cooperative Limited), భారత్ కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ (Bharat Cooperative Export Limited) శాఖలు నిజామాబాద్లో ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా పసుపు ఎగుమతులు పెంచుతామని అమిత్ షా పేర్కొన్నారు.
Turmeric Board inauguration | పాకిస్తాన్కు దీటైన జవాబు ఇచ్చాం
ఉరి, పుల్వామా, పహల్గామ్ దాడులకు దీటైన బదులు ఇచ్చామని అమిత్ షా తెలిపారు. పదేళ్లలో మూడు సార్లు పాకిస్తాన్పై భారత్ దాడి చేసిందని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేశామని గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి దాడి చేశామన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్లను భారత సైన్యం ధ్వంసం చేసిందన్నారు. అంతేకాకుండా కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టిందని పేర్కొన్నారు. కానీ రాహుల్ గాంధీ ఆధారాలు అడుగుతున్నారన్నారు. పాకిస్తాన్ మాట రాహుల్ గాంధీ నోట వస్తోందన్నారు.
Turmeric Board inauguration | 2026లో నక్సల్స్ ముక్త్ భారత్
దేశంలో 2026 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. దశాబ్దాలుగా అభివృద్ధిని నక్సలిజం అడ్డుకుంటోందన్నారు. మావోయిస్టులను అంతం చేయాలా వద్దా మీరే చెప్పండి అని అడిగారు. మావోయిస్టులు వెంటనే హత్యాకాండ విడిచి తక్షణం లొంగిపోవాలని సూచించారు. దేశ భద్రతను మోదీ పటిష్టం చేస్తున్నారని పేర్కొన్నారు.
Turmeric Board inauguration | కోట్లు కొల్లగొట్టిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ (BRS) హయాంలో రాష్ట్రంలో ఎంతో అవినీతి జరిగిందని అమిత్ షా అన్నారు. ధరణి, కాళేశ్వరం, సింగరేణి నియామకాలు, టీఎస్పీఎస్సీ పేరిట కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతి వద్దనుకొని ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగించారన్నారు. కానీ రేవంత్రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ అవినీతిపై కేసులు నమోదు చేయడం లేదన్నారు. ప్రస్తుతం రేవంత్ సర్కారు కూడా అవినీతి మయంగా మారిందని విమర్శించారు. గతంలో తెలంగాణ బీఆర్ఎస్కు ఏటీఎంగా ఉండేదని, ఇప్పుడు ఢిల్లీకి ఏటీఎంగా మారిందన్నారు. రాష్ట్రంలో అధికారం మారినా అవినీతి మారలేదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని పేర్కొన్నారు.