అక్షరటుడే, వెబ్డెస్క్ : SBS | అంతరిక్ష నిఘాను మరింత పటిష్టం చేసుకోవడంపై భారత్ దృష్టి సారించింది. పాకిస్తాన్(Pakistan)లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ద్వారా శత్రు భూభాగంపై ‘లోతైన’, ‘నిరంతర’ నిఘా పెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రధానంగా చైనా, పాకిస్తాన్తో పాటు హిందూ మహా సముద్రంపై నిఘా పెట్టేందుకు వీలుగా 52 ప్రత్యేక ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతం చేయాలని యోచిస్తోంది. ఇది సమగ్ర సైనిక అంతరిక్ష సిద్ధాంతాన్ని కూడా ఖరారు చేసే ప్రక్రియలో ఉంది.
SBS | వేగంగా ఉపగ్రహ ప్రయోగాలు
ఆపరేషన్ సిందూరు అనంతరం అంతరిక్ష నిఘాను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రియల్ టైమ్ మానిటరింగ్ కోసం రూ.27 వేల కోట్లను వెచ్చించనుంది. గత అక్టోబర్లో ప్రధాని(PM Modi) నేతృత్వంలోని భద్రత వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రూ. 26,968 కోట్ల వ్యయంతో ఆమోదించిన స్పేస్-బేస్డ్ సర్వైలెన్స్ (SBS) కార్యక్రమం 3వ దశలో ఇస్రో 21 ఉపగ్రహాలను, మూడు ప్రైవేట్ కంపెనీలతో 31 ఉపగ్రహాలను నిర్మించి ప్రయోగించనుంది.
అయితే, ఈ ప్రక్రియను వేగంగా పట్టాలెక్కించేందుకు యత్నిస్తోంది. ఈ ఉపగ్రహాలలో మొదటిది వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రయోగించనున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ(Defense Ministry) ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (IDS) కింద డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ (DSA) నేతృత్వంలోని ఈ ప్రాజెక్టులో భాగంగా 2029 చివరి నాటికి మొత్తం 52 ఉపగ్రహాలను నింగిలోకి పంపించనున్నారు. “ఈ సమయ పాలనలను కుదించి ఉపగ్రహాలను తక్కువ భూమి కక్ష్య (LEO), భూస్థిర కక్ష్యలోకి వేగంగా ప్రవేశపెట్టే పని ప్రారంభమైంది. కాంట్రాక్టులు పొందిన మూడు ప్రైవేట్ కంపెనీలకు ఉపగ్రహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించామని ”అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.