అక్షరటుడే, వెబ్డెస్క్ :SPY Satellite | ప్రస్తుతం సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందింది. దీంతో శత్రుదేశాల కదలికలను గమనించడానికి చాలా దేశాలు గూఢచార ఉప్రగ్రహాలను ప్రయోగిస్తున్నాయి. ఆయా శాటిలైట్లు(Satellites) శత్రుదేశాలపై నిఘా ఉంచుతాయి. ఈ క్రమంలో నిఘా ఉపగ్రహాల జాడ కనిపెట్టడానికి భారత్ త్వరలో కీలక ప్రయోగం చేపట్టనుంది.
రక్షణ మంత్రిత్వ శాఖ(Defense Ministry) చేపడుతున్న ఈ ప్రాజెక్ట్, తుది దశలో ఉంది. ఉపగ్రహ మ్యాపింగ్ సామర్థ్యాలను కలిగి ఉండే ఈ వ్యవస్థను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించనున్నారు. రాబోయే రోజుల్లో భారత్ అంతరిక్షంలో తన ఉనికిని మెరుగుపరచడంపై దృష్టి సారించిందని, అందులో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఇస్రో సీనియర్ అధికారి(ISRO Senior Officer) తెలిపారు. ఈ ఉపగ్రహాల నెట్వర్క్ భారతదేశ అంతరిక్ష డొమైన్ అవగాహనను పెంచుతుంది.
SPY Satellite | ఇక యుద్ధాలు అంతరిక్షంలో..
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల్లో వైమానిక దళం(Air Force) కీలక పాత్ర పోషిస్తుంది. యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్ల దాడులతో ఎక్కువ నష్టం జరుగుతోంది. అయితే భవిష్యత్లో యుద్ధాలు అంతరిక్షంలో కూడా జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత్ అంతరిక్షంలో తన పట్టు పెంచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఉపగ్రహాల సముహాన్ని మోహరించనుంది. ఇందుకోసం ఇస్రోబెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్తో ఒప్పందం కూడా చేసుకుంది. వచ్చే ఏడాదిలోపు ఈ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో చర్యలు చేపట్టింది.
SPY Satellite | ఉపగ్రహ మ్యాపింగ్ ఎలా పనిచేస్తుంది?
విదేశీ ఉపగ్రహాలను పర్యవేక్షించే సామర్థ్యాలను ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు కలిగి ఉన్నాయి. భారత్(Bharath) చేపట్టనున్న ప్రయోగం విజయవంతం అయితే ఆ దేశాల సరసన మనం కూడా నిలవొచ్చు. ఈ ఉపగ్రహాల ఇతర దేశాల శాటిలైట్ల నుంచి డేటాను సేకరించగలవు. అలాగే అంతర్-ఉపగ్రహ సమాచార మార్పిడిని, గ్రౌండ్ స్టేషన్లకు లింక్లను అడ్డుకోగలవు. దీంతో శత్రుదేశాల నిఘా ఉపగ్రహాలు అందించే సమాచారం ఆ దేశాలకు చేరకుండా అడ్డుకోవచ్చు.
SPY Satellite | 52 ఉపగ్రహాల సమూహం
భారత్ ‘స్పై శాటిలైట్ ప్రోగ్రామ్'(Spy satellite program), స్పేస్-బేస్డ్ సర్వైలెన్స్-3 లో భాగంగా రాబోయే రెండు సంవత్సరాలలో 52 నిఘా ఉపగ్రహాల సమూహాన్ని ప్రయోగించనుంది. ఈ ప్రాజెక్టుకు ఒక రూపాన్ని ఇవ్వడానికి మూడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లు, అనంత్ టెక్నాలజీస్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రభుత్వంతో చేతులు కలిపాయి. రూ. 27,000 కోట్ల ఈ ప్రాజెక్ట్ జాతీయ భద్రతా సామర్థ్యాలను గణనీయంగా మెరుగు పరచనుంది.