అక్షరటుడే, న్యూఢిల్లీ: India’s actions : చైనా అండతో తోక జాడిస్తున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇప్పుడు బెంబేలెత్తుతోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్పై భారత్ తీసుకుంటున్న కఠిన చర్యలతో బంగ్లా వెన్నులో వణుకు పుడుతోంది.
కుట్రపూరితంగా తిరుగుబాట్లు లేవదీసి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి, గద్దెనెక్కిన మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్తో కయ్యానికి కాలు దువ్వింది. మన ప్రత్యర్థులు చైనా, పాకిస్తాన్తో అంటకాగుతూ సవాలు విసిరింది.
అయితే, ఏప్రిల్ 22న పహల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడితో అప్రమత్తమైన భారత్.. ఈ దుశ్చర్య వెనుక ఉన్న పాకిస్తాన్పై అన్ని విధాలుగా చర్యలకు ఉపక్రమించింది. ఇందులో ప్రధానమైనది 1960 నాటి సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంది. పాకిస్తాన్ను ఏడారి చేయడానికి ఈ ఒక్క నిర్ణయం చాలు.
India’s actions : ఎగిరెగిరి పడిన యూనస్..
బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత ఆ దేశం మనతో సఖ్యతగానే ఉంటూ వచ్చింది. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా బంగ్లా మనకు ఎంతో ముఖ్యమైనది. అయితే, షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి గద్దెనెక్కిన మహమ్మద్ యూనస్ భారత వ్యతిరేక చర్యలు ప్రారంభించారు. బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులు, ఆస్తుల దహనాలు జరుగుతున్నా కనీసం స్పందించలేదు. పైగా చాలా ఏళ్లుగా పాకిస్తాన్తో నిలిచిపోయిన వాణిజ్యాన్ని పునరుద్ధరించారు. పాక్ ఐఎస్ఐకి స్వేచ్ఛాహస్తం అందించారు.
అలాగే, చైనాకు సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు. మన దేశంలోని కీలకమైన సిలిగురి కారిడార్, సుందర్బన్ లోని మోంగ్లా ఓడరేవుకు దగ్గరగా ఉన్న వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలలో చైనాను పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారు. తద్వారా భారతదేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేశారు.
India’s actions : జాగ్రత్తగా అడుగులేస్తున్న ఇండియా..
యూనస్ ప్రభుత్వ చర్యలను కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసినందుకు పాకిస్తాన్కు సింధూ జలాలు ఇవ్వకుండా ఆపేసింది. గతంలో మూడు యుద్ధాలు జరిగినప్పటికీ భారత్ ఎప్పుడూ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేదు.
కానీ, పహల్ గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది. సింధూ జలాల నిలిపివేత బంగ్లాదేశ్ను షాక్కు గురి చేసింది. ఇదే ప్రణాళికను తమపైనా ప్రయోగించే ప్రమాముందన్నది ఆ దేశానికి తెలుసు. చైనాకు దగ్గరైన కేంద్రం ఇంటీవలే బంగ్లాకు షాక్ ఇచ్చింది. ఆ దేశానికి ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది.
ఇప్పుడు పాక్పై జల ఖడ్గం ప్రయోగించినట్లుగానే తమపైనా ప్రయోగించవచ్చన్న భయం మొదలైంది. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన గంగా జల ఒప్పందం వచ్చే ఏడాదితో ముగియనుంది. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించకుంటే బంగ్లాకు పెను ప్రమాదం తప్పదు. గంగా నది దాటి రెండు ప్రధాన నదులు తీస్తా, బ్రహ్మపుత్ర, బరాక్ ఫెని వంటి ఇతర నదులు బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తాయి.
2019లో ఫెని నది నీటి భాగస్వామ్య ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది. మిగతా వాటిపై ఎటువంటి ఒప్పందాలు లేవు. దీంతో బంగ్లాపై జల ఖడ్గం ప్రయోగించేందుకూ భారత్ వద్ద అనేక ఆయుధాలున్నాయి. అలాగే, వరద హెచ్చరికలు, వాతావరణ డేటాను భారత్ ఇప్పటిదాకా బంగ్లాకు అందిస్తూ వచ్చింది. ఇప్పుడు ఏ కాస్త తిక్క వేషాలు వేసినా భారత్ ఆ సమాచారాన్ని ఆపేస్తే బంగ్లాదేశ్లో వినాశనం తప్పదు. అందుకే ఆ దేశం కంగారు పడుతోంది. మన ప్రత్యర్థులతో చేతులు కలపడానికి వెనుకాముందు ఆలోచిస్తోంది.