అక్షరటుడే, వెబ్డెస్క్ :Iran- Israel Conflict | ఇజ్రాయిల్ క్షిపణి దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. ఇరాన్లోని అనేక ప్రాంతాల్లో మిస్సైల్స్, బాంబుల మోత మోగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు(Indian students) తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తమను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇరాన్(Iran) అంతటా ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతుండటంతో వందలాది మంది భారతీయ వైద్య విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. తమను సురక్షింతగా స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని(India Government) వేడుకుంటున్నారని, తాము ఇక్కడ సురక్షితంగా లేమని చెబుతున్నారని వార్తా సంస్థ ANI నివేదించింది. “శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు పెద్ద పేలుళ్ల శబ్దాలు విని నేను మేల్కొని బేస్మెంట్లోకి పరుగెత్తాను. అప్పటి నుంచి మేము నిద్రపోలేదు” అని టెహ్రాన్(Tehran)లోని షాహిద్ బెహెష్టి విశ్వవిద్యాలయంలో మూడవ సంవత్సరం MBBS విద్యార్థి ఇమ్తిసల్ మొహిదిన్ వెల్లడించారు. ఈ విశ్వవిద్యాలయంలో చేరిన 350 మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. పరిస్థితి మరింత దిగజారుతున్నందున ప్రస్తుతానికి అక్కడ బోధన నిలిపి వేశారు.
Iran- Israel Conflict | హాస్టళ్లకు సమీపంలో పేలుళ్లు..
విద్యార్థుల హాస్టళ్లు, అపార్ట్మెంట్లకు సమీపంలో పేలుళ్లు సంభవించాయి. దీంతో చాలామంది బేస్మెంట్లలో ఆశ్రయం పొందుతున్నారు. “మేము మా అపార్ట్మెంట్ బేస్మెంట్లో చిక్కుకున్నాము. ప్రతి రాత్రి పేలుళ్ల శబ్దాలు భయపెట్టిస్తున్నాయి. మాకు సమీపంలోనే పేలుడు జరిగింది. మూడు రోజులుగా నిద్రపోలేదు” అని జమ్మూకాశ్మీర్(Jammu and Kashmir)లోని కుప్వారా జిల్లాలోని హంద్వారాకు చెందిన మోహిదిన్ ANIకి ఫోన్లో చెప్పారు. ఒక్క టెహ్రాన్లోనే కాదు, మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సురక్షితమైన ప్రాంతాలుగా పరిగణించబడే ప్రాంతాల్లోనూ భయంకర పరిస్థితులు ఉన్నాయని కెర్మాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి ఫైజాన్ నబీ వాపోయాడు. “ఈరోజు మా నగరంలో తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నాము. టెహ్రాన్లోని నా స్నేహితులు భయభ్రాంతులకు గురయ్యారు. 3-4 రోజులు తాగునీటిని నిల్వ ఉంచుకోవాలని మాకు సలహా ఇచ్చారు. అది ఎంత దారుణం” అని తెలిపారు. తాము వైద్యులు కావడానికి ఇక్కడకు వచ్చామని, ఇప్పుడు బతికి ఉండడానికి ప్రయత్నిస్తున్నామని శ్రీనగర్ నివాసి ఫైజాన్ ANIతో వాపోయారు.
Iran- Israel Conflict | విద్యార్థులతో టచ్లో ఉన్న ఎంబసీ
భారతీయ విద్యార్థులతో ఇరాన్లోని ఇండియన్ ఎంబసీ(Indian Embassy) నిరంతరం టచ్లో ఉంది. అయినప్పటికీ బాంబుల మోతతో వారు ఆందోలనకు గురవుతున్నారు. భారత రాయబార కార్యాలయం నుంచి వచ్చే సందేశాలు, భద్రతా సలహాలపై ప్రధానంగా ఆధారపడి తాము ఇంటి లోపలే ఉంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. “పరిస్థితి మరింత దిగజారకముందే మమ్మల్ని తీసుకెళ్ఖాలని మేము భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. రాయబార కార్యాలయం టచ్లో ఉంది, కానీ మేము భయపడుతున్నాము. మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లండని ” అని మోహిదిన్ తెలిపారు.
Iran- Israel Conflict | రంగంలోకి దిగిన విదేశాంగ శాఖ
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు మన విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. పౌరులను సురక్షితంగా తీసుకొచ్చే చర్యలు ప్రారంభించింది. ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో టెహ్రాన్లోని తన రాయబార కార్యాలయం భారతీయ పౌరుల భద్రతను నిర్ధారించడానికి కృషి చేస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(India Foreign Affairs Ministry) సోమవారం ధృవీకరించింది. “రాయబార కార్యాలయం సహకారంతో విద్యార్థులను ఇరాన్లోని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు” అని పేర్కొంది.