అక్షరటుడే, వెబ్డెస్క్ : Indian Missiles | పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో పాకిస్తాన్ వణికిపోయింది. వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకు పడడంతో కాళ్ల భేరానికి వచ్చింది. తమకు నష్టం జరుగలేదని, భారత్ మిసైళ్లను(Indian missiles) కూల్చేశామని ఇన్నాళ్లు బుకాయించిన పాకిస్తాన్ ఇప్పుడు అసలు విషయాన్ని వెల్లడించింది. భారత మిసైళ్లు వైమానిక స్థావరాలపై పడ్డాయని దాయాది ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్(Pakistan Prime Minister Shehbaz Sharif) వెల్లడించారు. రావల్పిండిలోని నూర్ఖాన్ వైమానిక స్థావరం, ఇతర ప్రదేశాలపై భారతదేశం చేసిన కచ్చితత్వ క్షిపణి దాడిని షరీఫ్ అంగీకరించారు. మే 9, 10 తేదీలలో మధ్య రాత్రి 2:30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్(Army Chief General Asim Munir) స్వయంగా తనకు ఫోన్ చేసి ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన దాడి గురించి తెలియజేశారని వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ మాన్యుమెంట్ వద్ద జరిగిన ప్రత్యేక ‘యుమ్-ఎ-తషాకూర్’ కార్యక్రమంలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు.
Indian Missiles | భారత్ దాడి నిజమే..
మే 9, 10వ తేదీల్లో రాత్రి సమయంలో రావల్పిండిలోని నూర్ఖాన్ సహా ఇతర వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు పాక్ ప్రధాని(Pakistan Prime Minister) అంగీకరించారు. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ రోజు తెల్లవారుజామున ప్రార్థనలు ముగించుకుని స్విమ్మింగ్కు వెళ్లా. సెక్యూర్డ్ ఫోన్ మాత్రమే తీసుకెళ్లా. రెండుసార్లు ఫోన్ మోగింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ లైన్లోకి వచ్చి భారత్ దాడులు చేస్తున్న విషయాన్ని చెప్పారన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు మన వైమానిక దళం స్వదేశీ సాంకేతికతతో పాటు చైనా యుద్ధ విమానాలను వినియోగిస్తోందని మునీర్ వివరించారన్నారు. అయితే, భారత్పై ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు కూలిపోయిన విషయాన్ని ఆయన చెప్పలేదు. “మే 9-10 తేదీల మధ్య రాత్రి 2.30 గంటల ప్రాంతంలో, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నాకు సెక్యూర్డ్ ఫోన్ చేసి, హిందుస్తానీ బాలిస్టిక్ క్షిపణులు నూర్ ఖాన్ ఎయిర్బేస్ మరియు ఇతర ప్రాంతాలను ఢీకొట్టాయని నాకు తెలిపారు. జనరల్ స్వరంలో విశ్వాసం, ఆత్మవిశ్వాసం, దేశభక్తి ఉందని నేను దేవునిపై ప్రమాణం చేయడం ద్వారా మీకు చెప్పగలనని” వివరించారు.