అక్షరటుడే, వెబ్డెస్క్: BCCI | భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ధూర్తదేశం పాకిస్తాన్కు ఇండియా మరోషాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో భారత సైన్యం దాయాదిని కోలుకోలేని దెబ్బ కొట్టింది.
తాజాగా బీసీసీఐ(BCCI) వంతు వచ్చింది. త్వరలో జరగాల్సిన ఆసియా కప్(Asia Cup) నుంచి వైదొలగాలని భారత క్రికెట్ నియంత్రణ సంస్థ (బీసీసీఐ) నిర్ణయించుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, భారత్లో శత్రు దేశంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న నేపథ్యంలో బీసీసీఐ(BCCI) ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగట్లేదు. ఇటీవల జరిగిన చాంపియన్షిప్ టోర్నీ(Championship trophy)కి కూడా పాక్కు వెళ్లేందుకు భారత్ సుముఖత తెలుపలేదు. ఈ నేపథ్యంలో ఇండియా తటస్థ వేదికలపైనే మ్యాచ్లు ఆడింది. ఇక, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ పహల్గామ్ దాడి(Pahalgam terror attack) తర్వాత ఆ దేశంతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇకపై ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో కూడా పాక్తో తలపడొద్దని నిర్ణయించినట్టు తెలిసింది. పాక్ను ఏకాకిని చేసే వ్యూహంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
BCCI | పాక్కు షాక్..
ఏ టోర్నీ అయినా ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటేనే దానికి ప్రధాన ఆకర్షణ. అది వరల్డ్ కప్ అయినా, చాంపియన్స్ ట్రోఫీ అయినా, ఇంకొకటి అయినా రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్పైనే ప్రపంచం మొత్తం దృష్టి నెలకొంటుంది. అయితే, ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్కు భారత నిర్ణయం గట్టి షాకే ఇచ్చినట్లయింది.
ఈసారి ఆసియా కప్(Asia Cup) భారత్లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణ భారత్, పాక్ మ్యాచ్లే. ఈ మ్యాచ్ జరిగే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. దీంతో, ఆసియా కప్(Asia Cup) లాభదాయకతపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆసియా బోర్డు(Asia Board)కు పీసీబీ చైర్మన్ మోహ్సీన్ నఖ్వీ నేతృత్వం వహిస్తున్నారు. బీసీసీఐ మాజీ సెక్రెటరీ జైషా ఐసీసీ బాధ్యతలు తీసుకున్నాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) బాధ్యతలను మోహ్సీన్ చేపట్టారు.
ఇక భారత్ నిర్ణయంతో పాక్కు ఆర్థికంగా గట్టి షాక్ తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘‘పాక్ మంత్రి చీఫ్గా ఉన్న ఏసీసీ నిర్వహించే ఏ టోర్నీలోనూ భారత్ పాల్గొనదు. ఈ విషయాన్ని మౌఖికంగా ఏసీసీకి మేము తెలియజేశాము. త్వరలో జరగనున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాము. భవిష్యత్తులో జరిగే ఇతర టోర్నీల్లో కూడా పాల్గొనేది లేదని అన్నాము. దీనిపై భారత ప్రభుత్వంతో కూడా నిరంతరం టచ్లో ఉన్నాము’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
BCCI | ఆసియా కప్ నిర్వహణ కష్టమే..
ఆసియా కప్(Asia Cup) మీడియా హక్కులను గతేడాది సోనీ పిక్చర్స్(Sony Pictures) నెట్వర్క్స్ ఇండియా.. 170 మిలియన్ డాలర్లకు దక్కించుకుంది. ఈసారి ఆసియా కప్(Asia Cup) జరగకపోతే ఈ డీల్ను కూడా పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. 2023 ఆసియా కప్(Asia Cup)లో భారత్ విజేతగా నిలిచింది. హైబ్రీడ్ మోడల్లో ఈ టోర్నీ నిర్వహించారు. కొలంబోలో జరిగిన ఫైనల్స్లో భారత్ టైటిల్ దక్కించుకోగా, పాకిస్తాన్ పైనల్స్కు క్వాలిఫై కాకుండానే వెనుదిరిగింది. తాజాగా పాకిస్తాన్ పాల్గొనే టోర్నీల్లో పాల్గొనకూడదని భారత్ నిర్ణయించడంతో ఆసియా కప్ నిర్వహణ అనుమానాస్పదంగా మారింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించింది. స్పాన్సర్లలో ఎక్కువ మంది భారతదేశం నుంచి వచ్చినందున, భారత జట్టు లేకుండా ఆసియా కప్ను నిర్వహించడం ACCకి సాధ్యం కాదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.