అక్షరటుడే, వెబ్డెస్క్: Defence Ministry | భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడంతో దేశీయంగా ఆయుధాలను తయారు చేస్తోంది. ముఖ్యంగా వివిధ రకాల మిసైళ్లను రూపొందిస్తోంది. అయితే ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) అనంతర పరిణామాల నేపథ్యంలో రక్షణ రంగానికి భారీగా నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.
Defence Ministry | అదనంగా రూ.50 వేల కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో రక్షణ శాఖకు రూ.6.81 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack) అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పీవోకేతో పాటు పాకిస్తాన్లోని 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. భారత్ దాడితో దెబ్బతిన్న పాక్ ప్రతీకారదాడులకు దిగింది. వందల సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లతో భారత్లోని సైనిక స్థావరాలపై దాడికి యత్నించింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్–400, ఆకాశ్ క్షిపణులు వాటిని అడ్డుకున్నాయి. అనంతరం భారత్ ప్రతిదాడులు చేసి పాక్లోని పలు ఎయిర్బేస్లను ధ్వంసం చేసింది.
Defence Ministry | అత్యాధునిక రక్షణ వ్యవస్థ కోసం..
శత్రు దేశాల విమానాలు, క్షిపణులు, యుద్ధ విమానాలను అడ్డుకోవడానికి భారత్(Bharath) ప్రస్తుతం రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 వ్యవస్థను వినియోగిస్తుంది. రష్యా ఇప్పటికే మూడు యూనిట్లు భారత్కు సరఫరా చేయగా మరో రెండు యూనిట్లు ఏడాదిలోగా డెలివరీ ఇవ్వనుంది. అయితే భారత్ గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో రక్షణ వ్యవస్థ ఉండాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల డ్రోన్ల నుంచి రక్షణ కోసం భార్గవాస్త్ర(Bhargavastra) పేరుతో చేపట్టిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. దీంతో మరిన్ని పరిశోధనలు, ప్రయోగాలు, అత్యవసర ఆయుధాల కోసం రూ.50 వేల కోట్లు రక్షణ శాఖకు కేంద్రం అందించనున్నట్లు తెలిసింది.