అక్షరటుడే, వెబ్డెస్క్:High Court Judge | అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ(Yashwant Verma)పై అభిశంసన తీర్మానం పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో ఆయన అధికారిక నివాసంలో భారీగా డబ్బు బయటపడిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో మంటలు చెలరేగడంతో ఆర్పేందుకు వెళ్లిన ఫైరింజన్ సిబ్బంది (Fire engen staff).. ఓ రూమ్లో పెద్ద సంఖ్యలో నోట్ల కట్టలు కాలిపోయినట్లు గుర్తించారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ అంతర్గతంగా విచారణ జరిపించింది. కమిటీ నివేదిక రావడంతో అత్యున్నత న్యాయస్థానం (Supreme Court).. తదుపరి చర్యల కోసం రాష్ట్రపతితో పాటు కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. దీంతో జస్టిస్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి
High Court Judge | రాజీనామాకు ససేమిరా..
వర్మ అధికారిక నివాసంలో భారీగా డబ్బు లభ్యమైందన్న విషయాన్ని న్యాయమూర్తుల కమిటీ నిర్ధారించింది. డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా (Supreme Court Judge Sanjiv Khanna).. జస్టిస్ వర్మను రాజీనామా చేయాలని సూచించారు. అందుకు ఆయన నిరాకరించారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే వర్మను ఢిల్లీ నుంచి అలహాబాద్కు బదిలీ చేశారు. రాజీనామాకు నిరాకరించడంతో అప్పటి సీజేఐ ఖన్నా.. అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని సిఫారసు చేస్తూ రాష్ట్రపతి(President)కి, కేంద్రానికి లేఖ రాశారు.
జస్టిస్ వర్మ స్వయంగా రాజీనామా చేయకపోతే జూలైలో ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయనపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతానికి వర్మపై చర్య తీసుకోవడానికి అధికారిక ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని పేర్కొన్నాయి. రాజకీయ పార్టీల నుంచి విమర్శలను ఎదుర్కొన్న వర్మపై చర్య తీసుకునే ముందు ప్రతిపక్ష పార్టీలను విశ్వాసంలోకి తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. “ఈ విషయంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటాం. ఇంతటి కుంభకోణాన్ని విస్మరించడం కష్టం” అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
న్యాయమూర్తులను తొలగించేందుకు పార్లమెంట్(Parliament)కు అధికారం ఉంది. ఉభయ సభలలో దేనిలోనైనా అభిశంసన తీర్మానాన్ని తీసుకురావచ్చు. రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు ఈ ప్రతిపాదనపై సంతకం చేయాలి. అలాగే, లోక్సభలో 100 మంది సభ్యులు తీర్మానానికి మద్దతు తెలపాలి. అభిశంసన తీర్మానంపై రెండు సభల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. మూడింట రెండొంతుల మెజార్టీ వస్తే అభిశంసన తీర్మానం ఆమోదం పొందుతుంది.