అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad) ప్రజలు వణికిపోతారు. చిన్న వాన కురిసినా పలు కాలనీలు జలమయం కావడంతో పాటు రోడ్లు చెరువులను తలపిస్తాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ట్రాఫిక్ జామ్ (Traffic Jam)తో గంటల తరబడి రోడ్లపై ఉండిపోతారు. ఏళ్లుగా ఈ సమస్య నగర వాసులను వేధిస్తోంది. అయితే తాజాగా హైడ్రా (hydraa) మహానగరంలో వరద కట్టడికి చర్యలు చేపట్టింది. ఇటీవల సికింద్రాబాద్ (Secunderabad)లోని ప్యాట్నీ సెంటర్ వద్ద నాలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
Hydraa | మాదాపూర్లో పర్యటించిన కమిషనర్
హైదరాబాద్ నగరంలో మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో సైతం ప్రజలు వరద ముంపుతో అనేక ఇబ్బందుల పడతారు. ఈ క్రమంలో సోమవారం మాదాపూర్ (Madhapur)లోని పలు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) పరిశీలించారు. నాలాల్లో వరద సాఫీగా సాగుతుందా లేదా.. ఎక్కడైనా ఆటంకాలున్నాయా అనే అంశాలను పరిశీలించారు. వర్షం పడితే నీట మునుగుతున్న నెక్టార్ గార్డెన్స్ పరిసరాలలో వర్షపు నీరు నిల్వకుండా తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, జలమండలి అధికారులతో చర్చించారు.
దుర్గం చెరువు (Durgam Cheruvu)కు ఎండాకాలంలో కూడా నీటి కొరత ఉండదని, వర్షాకాలంలో నీటి నిల్వ స్థాయిని తగ్గిస్తే వరద పోటెత్తదని అధికారులు సూచించారు. వర్షం పడితే తమ కాలనీల్లో నిలిచి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు కమిషనర్కు విన్నవించారు. దీంతో దుర్గం చెరువులో నీటిమట్టం నిర్వహణపై ఇరిగేషన్, జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించారు.
Hydraa | ఆక్రమణల పరిశీలన
దుర్గం చెరువు దిగువ భాగంలో ఆక్రమణలతో పాటు.. వరద కాలువకు ఉన్న ఆటంకాలను కూడా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దుర్గం చెరువులో ఇనార్బిట్ మాల్ (Inorbit Mall) వైపు మట్టి పోయడంపై విచారించారు. అక్కడ పార్కు చేసిన వాహనాలకు సంబంధించి వాకబు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. దుర్గం చెరువు వరద కాలువకు ఆటంకం లేకుండా ఎంత మొత్తం నీరు విడుదల చేసినా సాఫీగా మల్కం చెరువుకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అయితే వరదల నియంత్రణకు హైడ్రా చర్యలు చేపడుతుండడంతో కాల్వలు, నాలాలు, చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారు ఆందోళన చెందుతున్నారు.