అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్(Hyderabad) నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతారు. చిన్న వాన పడిన నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునుగుతాయి. రోడ్లపై వరద నీరు నిలిచి చెరువులను తలపిస్తాయి. చెరువులు, నాలాల ఆక్రమణతో వరద వెళ్లే మార్గం లేక కాలనీల్లోకి నీరు వస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైడ్రా(Hydraa) కీలక చర్యలు చేపట్టింది. వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాలపై ఆక్రమణలను తొలగిస్తున్నారు.
నగరంలోని సైదాబాద్ పరిధిలో గల ఐఎస్ సదన్ కృష్ణానగర్(IS Sadan Krishnanagar)లో శుక్రవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు(Hydra Demolitions) చేపట్టింది. డ్రెయినేజీలపై ఆక్రమంగా చేపట్టిన నిర్మాణాలను జేసీబీల సాయంతో అధికారులు కూల్చివేశారు. కొందరు నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, దీంతో వరద నీరు తమ ఇళ్లలోకి వస్తోందని ఇటీవల స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ జరిపి ఆక్రమణలను గుర్తించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.
Hydraa | ఫిర్యాదులపై వెంటనే స్పందన
వర్షాకాలం కావడంతో వరద నీరు సాఫీగా వెళ్లేలా హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydraa Commissioner Ranganath) కీలక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల పలు చెరువులను సందర్శించారు. నాలాల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్(Secunderabad Patni Center) వద్ద నాలాను ఆక్రమించి నిర్మించిన మూడు కమర్షియల్ భవనాలను హైడ్రా కూల్చి వేసిన విషయం తెలిసిందే. ఆక్రమణల కూల్చివేతతోపాటు నాలాల్లో పూడిక తీత పనులను కూడా హైడ్రా పర్యవేక్షిస్తోంది. అలాగే చెరువులు.. నాలాలు కబ్జాకు గురైతే 8712406899 నంబర్కు సమాచారం ఇవ్వాలని హైడ్రా అధికారులు(Hydraa Officers) కోరుతున్నారు.