అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చర్లపల్లి చెరువు (Charlapalli Lake) రూపు రేఖలు మారనున్నాయి. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఆహ్వానం మేరకు హైడ్రా కమిషనర్(Hydraa Commissioner) ఏవీ రంగనాథ్ గురువారం చర్లపల్లి చెరువును సందర్శించారు. జైళ్ల శాఖ, హైడ్రాతో పాటు.. స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ ఎంసీ అధికారులు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. చర్లపల్లి జైలు ప్రాంతంలో ఉన్న 58 ఎకరాల చెరువును ఆధునికీకరించడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దడంపై ఉన్నతాధికారులు చర్చించారు.
Hydraa | అభివృద్ధి చేయడానికి చర్యలు
చెరువు చుట్టూ తిరిగి.. ఇన్లెట్, ఔట్లెట్లను పరిశీలించారు. ప్రస్తుతం చెరువులో కొద్దిమొత్తం నీరు ఉన్నా పరిశుభ్రంగా ఉండడంతో జీవవైవిద్యానికి అవకాశం లభించిందని.. ఇంకా ఈ చెరువు నిండా నీరుంటే మరింత ఆహ్లాదంగా మారుతుందని భావించారు. ఈ క్రమంలో చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి.. పర్యాటక, విహార కేంద్రంగా తీర్చిదిద్దడంపై చర్చించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు.. కట్టను బలోపేతం చేసి పాత్వేను అభివృద్ధి చేయడం వంటి పనులు వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. అలాగే సోలార్ లైటింగ్ సిస్టమ్తో పాటు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మరింత భద్రత ఉంటుందని భావించారు.
హకీంపేట నుంచి నాగిరెడ్డి కుంట, కాప్రా చెరువు, మోతుకులకుంట, బైసన్కుంట గొలుసుకట్ట చెరువుల ద్వారా చర్లపల్లి చెరువుకు నీరందుతుంది. ఈ చెరువుకు.. మురుగు నీరు కలవకుండా డైవర్ట్ నాలా కూడా ఉంది. చెరువు చుట్టూ దాదాపు మూడు కిలోమీటర్ల మేర నడక దారి అందుబాటులోకి వస్తుంది. చర్లపల్లి పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని సౌమ్య మిశ్రా చెప్పారు. ఒక్కో సెగ్మెంట్కు ఎంత ఖర్చు అవుతుందో సమగ్ర నివేదిక ఇస్తే ఆ క్రమంలో సీఎస్ఆర్ నిధులు అడగడానికి వీలవుతుందన్నారు.