అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad) నగరవాసులు నిత్యం భయంభయంగా బతుకుతారు. నగరంలోని చాలా ప్రాంతాలను వరద నీరు(Floods) ముంచెత్తుతుంది. అంతేగాకుండా రోడ్లపై నీరు చేరి చెరువులను తలపిస్తాయి. దీంతో చిన్న వాన పడ్డా ప్రజలు ఇళ్లకు చేరడానికి ట్రాఫిక్లో గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్లో వరదల నియంత్రణకు హైడ్రా(Hydraa) అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సికింద్రాబాద్లో నాలాల ఆక్రమణలను తొలగించిన అధికారులు.. తాజాగా మాన్సూన్ టీమ్స్(Mansoon Teams)ను రంగంలోకి దింపాలని నిర్ణయించింది.
Hydraa | 130 బృందాలు
వర్షాకాలంలో నగరాన్ని వరద ముంచెత్తకుండా హైడ్రా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు 130 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ను సమాయత్తం చేస్తోంది. ఒక్కో టీంలో 12 మంది ఉంటారు. ఈ ఎమర్జెన్సీ బృందాలకు హైడ్రాకు చెందిన 51 DRF బృందాలు కూడా తోడవుతున్నాయి. ఒక్కో DRF బృందంలో 15 మంది చొప్పున ఉంటారు. ఈ రెండు బృందాలు సమన్వయంతో పనిచేసేలా హైడ్రా అధికారులు దిశానిర్దేశం చేస్తారు. ఎక్కడ నీరు నిలుస్తోందో అక్కడ ఈ బృందాలు పనిచేస్తాయి. వరద ముప్పును తొలగించి వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. అలాగే నివాసప్రాంతాల్లో వరద నిలవకుండా చూస్తుంది.
Hydraa | పూడికతీసే పని జీహెచ్ఎంసీ పరిధిలోనే..
వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యతలను హైడ్రాకు అప్పగించిన విషయం విదితమే. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల విధుల పర్యవేక్షణ హైడ్రా పరిధిలోకి వచ్చింది. మురుగు కాల్వల్లో చెత్త, పూడిక తీసే పనులు మాత్రం GHMC పరిధిలోనే కొనసాగుతాయి. ఎక్కడయినా అవసరం ఉన్నా చోట జీహెచ్ఎంసీకి హైడ్రా సహకారం అందిస్తుంది.