Site icon aksharatoday.in

Hydraa | నాలాల ఆక్రమణలపై హైడ్రా ఫోకస్​.. సికింద్రాబాద్​లో కూల్చివేతలు షురూ..

Hydraa

Hydraa | నాలాల ఆక్రమణలపై హైడ్రా ఫోకస్​.. సికింద్రాబాద్​లో కూల్చివేతలు షురూ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | హైదరాబాద్(Hyderabad)​ నగరంలో వర్షాకాలం వచ్చిందంటే చాలా ప్రాంతాలు నీట మునుగుతాయి. చిన్న వర్షం పడినా రోడ్లన్నీ జలమయం అవుతాయి. దీనికి కారణం నాలాలు, చెరువుల ఆక్రమణ. నాలాలు, చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో నీరు వెళ్లే మార్గం లేక పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్​ నగరంలోని పలు చెరువులు, రోడ్లపై కబ్జాలను తొలగించిన హైడ్రా(Hydraa) తాజాగా నాలాలపై దృష్టి పెట్టింది.

Hydraa | సికింద్రాబాద్​లో కూల్చివేతలు

వర్షాకాలం రావడంతో హైడ్రా నాలాలపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. సికింద్రాబాద్​ పరిధిలోని బేగంపేట(Begumpet), ప్యాట్నీ(Patni)లో నాలాలను ఆక్రమించి చేపట్టిన పలు నిర్మాణాలను శుక్రవారం ఉదయం హైడ్రా సిబ్బంది కూల్చి వేస్తున్నారు. ప్యాట్నీ సెంటర్​లోని నాలాపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య నిర్మాణాలను తొలగించడానికి ప్రత్యేక డ్రైవ్​ ప్రారంభించారు. మొదట 70 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలా.. ఆక్రమణల కారణంగా కేవలం 15–18 అడుగులకు కుచించుకుపోయింది. దీంతో పాయుగ్ కాలనీ, పాట్నీ కాంపౌండ్, పాట్నీ కాలనీ, విమన్ నగర్, బీహెఈఎల్​ కాలనీ, ఇందిరమ్మ నగర్​లోకి తరచూ వరదలు వస్తున్నాయని ఆయా కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

Hydraa | కమిషనర్​ పరిశీలించిన మరుసటి రోజే..

స్థానికుల ఫిర్యాదు మేరకు నాలాల ఆక్రమణలను హైడ్రా కమిషనర్​ రంగనాథ్​(Hydra Commissioner Ranganath) గురువారం పరిశీలించారు. ప్యాట్నీ, రసూల్​పుర, చికోటి గార్డెన్స్(Chicoti Gardens) ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్యాట్నీ వ‌ద్ద‌ 17 మీటర్ల వెడల్పుతో ఉన్న నాలాపై భాగంలో 150 మీటర్ల మేర కేవలం ఆరేడు మీటర్లకే పరిమితమైనట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం ఉదయం ఆక్రమణలను కూల్చి వేయడం ప్రారంభించారు. మిగతా ప్రాంతాల్లో నాలాల కబ్జాలను అధికారులు తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Hydraa | చికోటి గార్డెన్స్‌లోనూ అదే ప‌రిస్థితి..

ప్ర‌కాశ్​న‌గ‌ర్ మెట్రో స్టేష‌న్(Prakashnagar Metro Station) వ‌ద్ద ప్రతి సంవత్సరం వరద ముంపు ఉంటుంది. 3 సెంటీమీట‌ర్ల కంటే ఎక్కువ వ‌ర్షం పడితే ప్ర‌కాష్‌న‌గ‌ర్ మెట్రో స్టేష‌న్‌తో పాటు.. చికోటి గార్డెన్స్ ప్రాంతాలు నీట మునిగిపోతాయి. ఇక్క‌డ‌ 6 మీట‌ర్ల వెడ‌ల్పులో ఉన్న వ‌ర‌ద కాలువ కొన్ని చోట్ల 4.5 మీట‌ర్ల మేర క‌బ్జా అయిందని స్థానికులు క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్​ స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయా ఆక్రమణలు కూడా త్వరలో తొలగించే అవకాశం ఉంది.

Exit mobile version