Site icon aksharatoday.in

Local Body Elections | ఆశావహుల‌కు త‌ప్ప‌ని నిరీక్ష‌ణ‌.. హైకోర్టు తీర్పుతో నిరాశ‌

Local Body Elections

Local Body Elections | ఆశావహుల‌కు త‌ప్ప‌ని నిరీక్ష‌ణ‌.. హైకోర్టు తీర్పుతో నిరాశ‌

అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Local Body Elections | స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి ఉవ్విళ్లూరుతున్న ఆశావహుల‌కు నిరీక్ష‌ణ త‌ప్ప‌డం లేదు. ఈ నెలాఖ‌రులోపే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ప్ర‌చారం జ‌రగ‌డం, అందుకనుగుణంగానే మంత్రుల ప్ర‌క‌ట‌న‌లు రావ‌డంతో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం నెల‌కొంది. అయితే పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై తాజాగా హైకోర్టు(High Court) వెలువ‌రించిన తీర్పు వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. మూడు నెల‌ల్లోపు ఎన్నికలు నిర్వ‌హించాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించ‌డం అభ్యర్థుల‌ను నిరాశ‌కు గురి చేసింది. తాజా తీర్పు నేప‌థ్యంలో మ‌రికొంత కాలం నిరీక్షించాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది.

Local Body Elections | ఏడాదిన్న‌ర‌గా ఎదురుచూపులు..

రాష్ట్రంలో పంచాయ‌తీ పాల‌క‌వ‌ర్గాల గ‌డువు ముగిసి ఏడాదిన్న‌ర దాటింది. 2024 జ‌న‌వ‌రి 30వ తేదీతో పాల‌క‌వ‌ర్గాల గ‌డువు ముగిసింది. అంత‌కు మూడు నెల‌ల ముందే అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress government) స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు మొగ్గు చూప‌లేదు. ఎన్నిక‌లు నిర్వ‌హించకుండా వాయిదా వేసిన ప్ర‌భుత్వం ప్ర‌త్యేకాధికారుల పాల‌న‌ను తీసుకొచ్చింది. దాదాపు ఏడాదిన్న‌ర కాలంగా ప్ర‌త్యేకాధికారుల పాల‌న కొన‌సాగుతుండ‌గా, ప‌ల్లెల్లో పాల‌న ప‌డకేసింది. ఎక్క‌డికక్కడ స‌మ‌స్య‌లు అలాగే ఉన్నాయి. మ‌రోవైపు పాల‌క‌వ‌ర్గాలు లేక‌పోవ‌డంతో అధికారుల ఇష్టారాజ్యం కొన‌సాగుతోంది. మ‌రోవైపు, ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క పోవ‌డంతో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు నిలిచి పోతున్నాయి.

Local Body Elections | ఆశావహుల ఎదురుచూపులు..

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఉత్సాహంగా ఉన్నారు. అయితే, వారి ఆశ‌ల‌పై ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు నీళ్లు చ‌ల్లుతోంది. ఏడాదిన్న‌ర కాలంగా స్థానిక పోరును వాయిదా వేస్తూ వ‌స్తోంది. దీంతో ఆశావహులకు ఎదురుచూపులు త‌ప్ప‌డం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చాలా మంది పంచాయ‌తీ స‌మ‌రంలో దిగేందుకు ఉత్సాహంతో ఉన్నారు. ఇప్ప‌టికే కావాల్సిన అన్ని వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుకున్నారు. గ్రామంలో క‌లియ‌దిరుగుతూ ఎవ‌రికీ ఏ క‌ష్టం వ‌చ్చినా అక్క‌డ వాలిపోతున్నారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. కానీ ఎన్ని రోజులు గ‌డుస్తున్నా ప్ర‌భుత్వం ఎన్నిక‌లు పెట్ట‌క‌పోవ‌డంతో ఉసురు మంటున్నారు.

Local Body Elections | హైకోర్టులో పిటిష‌న్లు..

ఏడాదిన్న‌ర‌గా ప్ర‌భుత్వం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కపోవ‌డంతో కొంద‌రు ఆశావహులు, మాజీ సర్పంచులు(former sarpanches) హైకోర్టును ఆశ్ర‌యించారు. పాల‌క‌వ‌ర్గాల గ‌డువు ముగిసి ఒక‌టిన్న‌ర‌ సంవ‌త్స‌రాలు గ‌డిచినా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో జాప్యం చేయ‌డాన్ని ప్ర‌శ్నిస్తూ ప‌లువురు పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ఆయా పిటిష‌న్ల‌ను ఇటీవ‌ల విచారించిన ధ‌ర్మాస‌నం తీర్పు రిజ‌ర్వ్ చేసింది. తాజాగా బుధ‌వారం తీర్పు వెలువ‌రించిన హైకోర్టు.. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను మూడు నెల‌ల్లో నిర్వ‌హించాలని ఆదేశించింది. 30 రోజుల్లో వార్డుల విభ‌జ‌న పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు జ‌స్టిస్ మాధ‌వీదేవి(Justice Madhavi Devi) రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఎన్నిక‌ల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.

Local Body Elections | నిరాశలో అభ్య‌ర్థులు

మూడు నెల‌ల్లోపు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న హైకోర్టు తీర్పు అభ్య‌ర్థుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. నెల రోజుల్లోనే పూర్తి చేయాల‌ని కోర్టు ఆదేశిస్తుంద‌ని అంతా భావించారు. మ‌రోవైపు స్థానిక ఎన్నిక‌ల‌పై(Local Body Elections) ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన ప్ర‌క‌ట‌న‌లు ఆశావాహుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు పెడ‌తామ‌ని, నెలాఖ‌రులోపు నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని మంత్రి పొంగ‌లేటి(Minister Ponguleti) స‌హా కొంద‌రు మంత్రులు ప్ర‌క‌ట‌న‌లు చేశారు. దీంతో పంచాయ‌తీ పోరుకు తెర లేచిన‌ట్లేన‌ని అంతా అనుకున్నారు. కానీ, హైకోర్టు మాత్రం మూడు నెల‌ల్లో పూర్తి చేయాల‌ని ఆదేశించడం ఆశావాహ‌ల‌ను నిరాశ‌కు గురి చేసింది. మ‌రింత కాలం నిరీక్ష‌ణ త‌ప్ప‌ద‌న్న ఆవేద‌న వారిలో నెల‌కొంది.

Exit mobile version