అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa Commissioner | హయత్నగర్ ఇన్స్పెక్టర్పై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydraa Commissioner Ranganath) ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో రాజాజీ నగర్ పేరిట వేసిన లేఅవుట్ను బుధవారం ఆయన పరిశీలించారు. దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో 190 వరకు ప్లాట్లతో ఉన్న లేఅవుట్లోని పార్కులు, రోడ్లను కలిపేసి సమ్మిరెడ్డిబాల్ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు ధ్రువపత్రాలతో తమ ప్లాట్లను కబ్జా చేశారంటూ పలువురు బాధితులు గతంలో ప్రజావాణి(Prajavani)లో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా ఆక్రమణలను, రోడ్లకు అడ్డంగా నిర్మించిన కట్టడాలను తొలగించింది.
సమ్మిరెడ్డి బాల్రెడ్డి మళ్లీ అక్కడ నిర్మాణాలు చేపట్టగా ప్లాట్ యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సమ్మిరెడ్డి వాళ్లపై దాడి చేశాడు. ఈ మేరకు బాధితులు మళ్లీ హైడ్రా(Hydraa)ను ఆశ్రయించారు. దీంతో కమిషనర్ రంగనాథ్ లేఅవుట్ను పరిశీలించారు. సమ్మిరెడ్డి బాల్ రెడ్డి దాడి చేయగా నెత్తిపై తనకు 12 కుట్లు పడ్డాయని ఓ బాధితుడు కమిషనర్కు చెప్పాడు. దీంతో దాడి చేసిన వారిపై ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టలేదని ఇన్స్పెక్టర్(Inspector)ను కమిషనర్ నిలదీశారు. లే అవుట్లోని పార్క్లు, రోడ్లను కబ్జా నుంచి విడిపిస్తామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కొహెడలోని కొత్త చెరువును సందర్శించారు.