అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad metro | హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరుగనున్నాయి. ధరల పెంపునకు కొద్దిరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. దీంతో హైదరాబాద్ మెట్రో, ఎల్అండ్టీ ధరల పెంపును అధికారికంగా ప్రకటించాయి. ప్రస్తుతం కనిష్టంగా ఉన్న రూ.10 టికెట్ ధర ఇక నుంచి రూ.12కు చేరనుంది. అలాగే, రూ.60 గరిష్ట ధర ఛార్జీల పెంపు తర్వాత రూ.75కు పెరుగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రేట్ల పెంపు అమలులోకి రానుందని హైదరాబాద్ మెట్రో సంస్థ వెల్లడించింది. మొదటి రెండు స్టాపులకు రూ.12, రెండు నుంచి నాలుగు స్టాపుల వరకు రూ.18 చొప్పున వసూలు చేయనున్నారు. నాలుగు నుంచి ఆరు స్టాపుల వరకు రూ.30, ఆరు నుంచి తొమ్మిది స్టాపుల వరకు రూ.40 చొప్పున టికెట్ రేట్లను సవరించారు.
Hyderabad metro | చాలా రోజులుగా ఊగిసలాట..
హైదరాబాద్ నగర రవాణాలో అతి కీలకమైన మెట్రో రైలు టికెట్ ఛార్జీల పెంపుపై చాలా రోజులుగా ఊగిసలాట కొనసాగుతోంది. ఛార్జీల పెంపుపై వ్యతిరేకత వస్తుందని భావించినప్పటికీ, ఎల్ అండ్ టీ అధికారులు నష్టాలను నివారించుకునేందుకు ముందడుగు వేయక తప్పలేదు. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన చార్జీల నిర్ణయ కమిటీ (ఎఫ్ఎఫ్సీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా టికెట్ రేట్లు పెంచాలని ప్రతిపాదించారు. దీనిపై కొద్దిరోజులుగా ప్రభుత్వంతో చర్చించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు ప్రభుత్వం అనుమతి తెలుపడంతో చార్జీల పెంపు ఖరారైంది. ఈ నెల 17 నుంచి కొత్త ఛార్జీలు అమలుల్లోకి రానున్నాయి. గరిష్ట ధర రూ.75లకు చేరనుంది.
Hyderabad metro | ఎల్అండ్టీకి భారీగా నష్టాలు..
హైదరాబాద్లో మొదటి దశ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో 2012లో రూ.14,132కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి 2017 నవంబరులో పూర్తిచేశారు. మియాపూర్-ఎల్బీ నగర్, జేబీఎస్ -ఎంజీబీఎస్, నాగోలు-రాయదుర్గం మధ్య 69.2 కిలోమీటర్ల పరిధిలో పనులు పూర్తిచేశారు. ప్రస్తుతం రోజుకు 1,200సర్వీసులు నడుస్తుండగా 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 5.10లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. కరోనాకు ముందు రోజుకు రూ.80 లక్షలకు పైగా ఆదాయం సమకూర్చుకున్న సంస్థ.. తర్వాత నుంచి కుదేలైంది. 2020 నుంచి 2022 వరకు ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో పాటు మాల్స్, ప్రకటనల నుంచి ఆశించిన ఆదాయం రాలేదు. ఇదే సమయంలో రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కింద ప్రభుత్వం ఇచ్చిన 267 ఎకరాల భూమిలో కేవలం నాలుగైదు ప్రాంతాల్లోనే కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించింది. చాలావరకు భూములు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. మనరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మెట్రోపై పడిందని ఎల్ అండ్ టీ అధికారులు చెబుతున్నారు. చివరకు రేట్ల పెంపునకు సర్కారు అంగీకరిండచడంతో నష్టాల నుంచి గట్టెక్కే అవకాశముందని భావిస్తున్నారు.