అక్షరటుడే, వెబ్డెస్క్ :Hyderabad | నగరాలు, పట్టణాల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఈ రోజుల్లో రూ.లక్షల లంచాలు ఇవ్వాల్సిందే. మున్సిపల్ అధికారులు(Municipal officers), స్థానిక కార్పొరేటర్లు(local corporators), చోట మోటా లీడర్లు ఇలా వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటారు. వారి చేతులు తడిపామా.. ఇంటి నిర్మాణంలో నిబంధనలు పాటించుకున్నా ఆ వైపు రారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. అయితే కార్పొరేటర్ వేధింపులు తాళలేక తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు.
హైదరాబాద్(Hyderabad)లోని బోరబండకు చెందిన మహ్మద్ సర్దార్ (35) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కార్పొరేటర్ బాబా ఫసుద్దీన్(Corporator Baba Fasuddin), అతని భార్య హబీబా సుల్తానా, అధికారుల వేధింపులతోనే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్ కుటుంబం ఇటీవల తమ ఇంటి పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. దీంతో కొందరు వచ్చి వారిని లంచం అడిగారు. వారి కుటుంబం లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో వేధింపులు ప్రారంభమయ్యాయి.
అధికారులు, కార్పొరేటర్(Corporator) కలిసి వారిని వేధించడంతో పాటు మూడో అంతస్తును కూల్చి వేశారు. బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనోవేదనకు గురైన సర్దార్ ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని సర్దార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.