అక్షరటుడే, వెబ్డెస్క్: Turmeric Board | ఒక్క పసుపు బోర్డును ఎన్ని సార్లు ప్రారంభిస్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. నిజామాబాద్ (Nizamabad) నగరంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ జనవరి 14న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) వర్చువల్గా పసుపు బోర్డును ప్రారంభించారన్నారు. ఈ రోజు మరోసారి అమిత్ షా బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు.
Turmeric Board | ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
తెలంగాణలోని రేవంత్ సర్కారు.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారిపోయిందని అమిత్ షా ఆరోపించిన విషయం తెలిసిందే. రేవంత్ అవినీతికి పాల్పడుతున్నారని తెలిసి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
Turmeric Board | కాళేశ్వరంపై బురదజల్లడం దురదృష్టకరం
ధాన్యం దిగుబడిలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తెలంగాణ ఎదగడంలో కీలకపాత్ర పోషించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswharam Project)పై బురదజల్లడం దురదృష్టకరమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది బీజేపీ (BJP) ఎంపీలను గెలిపించినా, ఇద్దరు కేంద్రమంత్రులున్నా రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కనీసం ఒక్క ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కాలేజీ వంటి ఉన్నత విద్యాసంస్థలు మంజూరు చేయకుండా బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని నాలుగు కోట్ల మంది ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు.
Turmeric Board | బడ్జెట్లో కేటాయింపులేవీ
కేంద్ర బడ్జెట్లో (Central Budget) పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించకుండా.. కార్యాలయం పెట్టి రిబ్బన్ కట్ చేస్తే ఉపయోగం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం సొంత భవనం కూడా కట్టకుండా.. గతంతో కేసీఆర్ నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించడం సమంజసమేనా అని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి నేటి వరకు అడుగడుగునా తెలంగాణ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న బీజేపీ ఈ రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రాదని కేటీఆర్ పేర్కొన్నారు.