అక్షరటుడే, వెబ్డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (IAMC) ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ కేటాయింపులను రద్దు చేస్తూ శుక్రవారం ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది.
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం (Rayadurgam)లోని 83/1లో సర్వే నంబర్లో 3.5 ఎకరాల భూమిని ఐఏఎంసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. ఐటీ కారిడార్ (IT Corridor) ప్రాంతంలో ఉన్న సదరు భూమి విలువ రూ.350 కోట్ల వరకు ఉంటుంది. అంతేగాకుండా సదరు సంస్థకు ఏడాదికి రూ.3 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ అని.. దానికి ప్రభుత్వ భూమి, నిధులు ఎలా కేటాయిస్తారని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు రఘునాథ్రావు, వెంకటరామ్రెడ్డి వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు లక్ష్మణ్, సుజనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై వాదనలు జనవరిలోనే ముగిశాయి. అప్పుడు తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. భూమి కేటాయింపుతో పాటు, దాని ప్రస్తుత భవన నిర్వహణ కోసం జారీ చేసిన జోవోలను కొట్టి వేసింది.