అక్షరటుడే, వెబ్డెస్క్: America : పశ్చిమాసియా(Western Asia) లోని మధ్యప్రాచ్యం(Middle East)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యూఎస్లో హై అలెర్ట్ ప్రకటించారు. ఇరాన్ అణు కేంద్రాలపై విరుచుకుపడిన అమెరికాపై ప్రతి దాడులు జరిగే అవకాశం ఉందనే అనుమానంతో ముందస్తు చర్యగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) తన అధికారిక పర్యటనలు రద్దు చేసుకున్నారు.
ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ‘అమెరికా దాడులు చేపట్టింది.. ఇక మేం ముగింపు పలుకుతాం’ అని ఇరాన్ తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగుతుందనే అనుమానంతో అమెరికా అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.
అమెరికాలోని ప్రధాన నగరాల్లోని ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేశారు. వాషింగ్టన్(Washington) సహా పలు నగరాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఇరాన్లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు న్యూయార్క్(New York) పోలీసు అధికారులు తెలిపారు. ముఖ్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉన్న కమ్యూనిటీలతో ముడిపడి ఉన్న ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు NYPD మాజీ ఇన్స్పెక్టర్ పాల్ మౌరో తెలిపారు. ఇజ్రాయెల్ తో ముడిపడి ఉన్న ప్రదేశాలు, షియా మసీదుల్లో గస్తీని పెంచినట్లు పేర్కొన్నారు. న్యూయార్క్ నగరానికి ప్రమాదం పొంచి ఉందా.. లేదా.. అని పర్యవేక్షిస్తున్నట్లు పోలీసు విభాగం తెలిపింది.
ఇరాన్లోని మూడు అణుకేంద్రాలు లక్ష్యంగా అమెరికా భీకర దాడులకు పాల్పడింది. అత్యంత శక్తివంతమైన B–2 స్పిరిట్ బాంబర్ల(B–2 Spirit bombers)తో ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అయితే, ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో యూఎస్ స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతున్నాయి.