అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | తెలంగాణ (Telangan)లో అప్పుడే వానాకాలం(Monsoon) మొదలైనట్లు వాతావరణం(Weather) మారిపోయింది. గత నాలుగు రోజులుగా వర్షం పడుతుండటంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
Weather Updates | వాయుగుండంగా మారే అవకాశం
అరేబియా సముద్రంలో (Arabian Sea) ఏర్పడిన అల్పపీడనం(Low pressure) శనివారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు(Heavy Rains in Telangana) కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
Weather Updates | పడిపోయిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు(Temperature) భారీగా పడిపోయాయి. ఎండలు దంచి కొట్టాల్సిన మే నెలలో చలిగాలులు వీస్తుండటం గమనార్హం. సాధారణంగా మే నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. 40 డిగ్రీలు దాటి ఎండలు మండుతాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటనే భయపడేవారు. కానీ ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఆదిలాబాద్లో 33.8, నిజామాబాద్లో 32 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
Weather Updates | చురుగ్గా రుతుపవనాలు
వాతావరణం అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తరించిన రుతుపవనాలు ఈ రోజు లేదా రేపు కేరళ(Kerala) తీరాన్ని తాకే అవకాశం ఉంది. గతేడాది మే 30న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ సారి ముందుగానే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వానాకాలం సీజన్ పనులు ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు.
Weather Updates | మరో అల్పపీడనం
ఇప్పటికే అరేబియా సముద్రంలో వాయుగుండంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. అంతేగాకుండా ఈనెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో కూడా రాష్ట్రంలో వర్షాలు పడుతాయని తెలిపింది.