అక్షరటుడే, వెబ్డెస్క్ :IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు మరో ఘోర పరాజయం ఎదురైంది. ప్లే ఆఫ్స్(Play Offs) రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైంది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఢిల్లీ ఓటమితో గుజరాత్తో పాటు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్(Punjab Kings) ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తమ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.
IPL 2025 | ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరాలంటే..
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 13 పాయింట్స్తో టేబుల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తమ చివరి రెండు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే 17 పాయింట్స్ వస్తాయి. అప్పుడు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్ ఓడినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే 17 ప్లస్ పాయింట్స్తో పాటు మెరుగైన రన్రేట్ ఉన్న గుజరాత్ టైటాన్స్(18), ఆర్సీబీ(17), పంజాబ్ కింగ్స్(17) ప్లే ఆఫ్స్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి.
మిగిలిన ఒక్క ప్లేస్ కోసం ముంబై, ఢిల్లీ, లక్నో పోటీపడుతున్నాయి. ముంబై 14 పాయింట్స్, ఢిల్లీ 13, లక్నో 10 పాయింట్స్తో ఉన్నాయి. ముంబైకే ప్లే ఆఫ్స్ చేరే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టు చివరి రెండు మ్యాచ్లు గెలిస్తే.. ఢిల్లీ, లక్నో ఇంటిదారి పడుతాయి. ముంబై ఒక్క మ్యాచ్లో ఓడినా.. ఢిల్లీకి అవకాశం ఉంటుంది. ముంబై ఒక మ్యాచ్లో ఓడి మరో మ్యాచ్ గెలిచినా.. ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్స్ చేరుతాయి. ఢిల్లీ(Delhi Capitals) ఒక మ్యాచ్లో ఓడి.. మరొకటి గెలిస్తే 15 పాయింట్స్ వస్తాయి. కాబట్టి ఢిల్లీ రెండు మ్యాచ్లకు రెండు గెలవాల్సిందే. ఒకవేళ ముంబై, లక్నో తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడి.. ఢిల్లీ ఒకటి గెలిస్తే టోర్నీలో ముందడుగు వేస్తోంది