అక్షరటుడే, వెబ్డెస్క్: BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీ రిజర్వేషన్ల కల్పన (BC Reservations) చరిత్రాత్మక నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Goud) అన్నారు. ఆయన గాంధీ భవన్లో (Gandhi Bhavan) శనివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇటీవల మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు తమ విజయమని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి మహేశ్ గౌడ్ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనికి కవిత సంబరాలు చేసుకోవడం ఏమిటో అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
దేశ చరిత్రలోనే బీసీలకు అత్యధికంగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మహేశ్ గౌడ్ అన్నారు. ఇది సామాజిక న్యాయానికి నాంది పలికే ఆర్డినెన్సు కానుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. బీసీల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ.. గతంలో తానే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ (BC Declaration)ను విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
BC Reservations | ఎమ్మెల్సీ కవితపై ఆగ్రహం
పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఎమ్మెల్సీ కవితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ (BRS)లో దెయ్యాల పీడ ఉందా? లేక దెయ్యాలే పనిచేస్తున్నాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని గతంలో కవిత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమె ఏ పార్టీకి చెందినవారో ప్రజలకు అర్థం కావడం లేదని మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం అన్నారు.
BC Reservations | కవిత రాజీనామా చేయాలి
రంగులు, వేషాలు మార్చినంత మాత్రాన పిల్లి పులి కాదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ (BRS)లో నైతికత ఉండి ఉంటే.. కవిత ఇప్పటివరకు రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధ్యం చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. ఈ విజయాన్ని సాధించేందుకు రాహుల్ గాంధీ ఆశయమే ప్రధాన కారణం అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.