అక్షరటుడే, వెబ్డెస్క్:Harish Rao | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)తో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (MLA Harish Rao) బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న హరీశ్ పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న తరుణంలో కేసీఆర్తో రెండోసారి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇద్దరి మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసు(Kaleswaram Commission Notice)లతో పాటు బీఆర్ఎస్లో ప్రస్తుత పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. కవిత ఎపిసోడ్పైనా చర్చతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. కవిత వేస్తున్న అడుగులపై కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవడంతో పాటు పార్టీకి నష్టం తెచ్చే చర్యలు మంచిది కాదని ఆయన అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Harish Rao | నోటీసులపై సుదీర్ఘ చర్చ..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారిస్తున్న ఘోష్ కమిషన్ కేసీఆర్తో పాటు హరీశ్రావుకు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కేసీఆర్ విచారణకు హాజరవుతారా.. లేదా? అన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. ఆయనే మంగళవారం స్పష్టతనిచ్చారు. జూన్ 5న కమిషన్ ముందు హాజరవుతానని ప్రకటించారు. కమిషన్ నుంచి నోటీసులు వచ్చిన తర్వాతి రోజే హరీశ్రావు ఇటీవలే పార్టీ అధినేతతో సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్న మరోమారు హరీశ్రావును ఫామ్హౌస్(Farmhouse)కు పిలిపించుకున్నారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట వినిపించాల్సిన వాదనలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. దాదాపు ఏడాది కాలంగా విచారిస్తున్న కమిషన్.. అప్పటి సాగునీటిశాఖ, ఆర్థిక అధికారులు , ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. విచారణ సందర్భంగా అప్పటి ప్రభుత్వ పెద్దల నిర్ణయం ప్రకారమే పని చేశామని అధికారులు వాంగ్మూలమిచ్చారు. బ్యారేజీల స్థల ఎంపిక, డిజైన్లు, నిధుల విడుదల సహా అన్ని పనులు రాజకీయ నిర్ణయాల మేరకే జరిగాయని తెలిపారు. అయితే, ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండగా, ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారించాలని నిర్ణయించిన కమిషన్.. కేసీఆర్తో పాటు నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ (Finance Minister Etela Rajender), సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావుకు నోటీసులు జారీ చేసింది. 5వ తేదీన విచారణకు హాజరు కానున్న కేసీఆర్.. కమిషన్ ముందు వినిపించాల్సిన వాదనపై హరీశ్రావుతో చర్చించినట్లు తెలిసింది.
Harish Rao | కవిత ఎపిసోడ్పై ఆరా..
సొంత తండ్రి కేసీఆర్పై ఎదురుతిరిగిన ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వ్యవహారంపైనా మామ అల్లుళ్ల మధ్య చర్చ జరిగింది. కవిత లేఖ బయటకు వచ్చిన తర్వాతి పరిణామాలు, పార్టీలో నెలకొన్న గందరగోళం తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. దూతలతో రాయబారం పంపినప్పటికీ కవిత వెనక్కు తగ్గకపోవడంపై కేసీఆర్ తీవ్రంగా కలత చెందారని, ఇదే అంశాన్ని హరీశ్రావు(Harish Rao) వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అయితే, కవిత ఎపిసోడ్పై ఇప్పటికప్పుడు పార్టీ తరఫున అధికారికంగా స్పందించాల్సిన అవసరం సూచించినట్లు తెలిసింది. కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్న తరుణంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం.