అక్షరటుడే, వెబ్డెస్క్ : Mahabubabad | పెళ్లయిన 18 రోజులకే వరుడు రెండో వివాహం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా (Mahabubabad district) డోర్నకల్ లో వెలుగు చూసింది. దీనిపై మొదటి భార్య శుక్రవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డోర్నకల్ సీఐ రాజేష్ (Dornakal CI Rajesh) కథనం ప్రకారం… రాజుతండాకు చెందిన స్వప్నకు మే 8న జయశంకర్ భూపాలపల్లిలో నివాసం ఉండే బోడ హర్షిత్ తో వివాహమైంది. కట్నకానుకల కింద రూ.4 లక్షల నగదు, 200 గజాల ఓపెన్ ప్లాట్, అర ఎకరం పొలం, ఆరు తులాల బంగారం, ఇతర లాంఛనాలు గట్టిగానే చెల్లించారు.
కానీ, కొన్ని రోజులకే భర్త మరో యువతితో తరచూ మొబైల్లో మాట్లాడుతుండటాన్ని స్వప్న గుర్తించింది. ఈ విషయాన్ని తన అత్త పద్మ (mother-in-law Padma), మామ హరి దృష్టికి కూడా తీసుకెళ్లింది. కాగా, భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోయి సెల్ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో స్వప్నకు మరింత అనుమానం కలిగి ఆరా తీయగా.. భూపాలపల్లిలోని (Bhupalapally) మహాముత్తారం శివారు యానంపల్లికి చెందిన సాయిప్రియ అనే అమ్మాయిని మే 25న హర్షిత్ పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో బాధితురాలు తాను మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు హర్షిత్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేష్ వెల్లడించారు.