అక్షరటుడే, వెబ్డెస్క్: Pasha mylaram | పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) ఆరోపించారు. నాలుగంతస్తుల భవనం కుప్పకూలి, వంద మంది వరకు అందులో చిక్కుకున్నా సహాయక చర్యల్లో జాప్యం చేస్తుండడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పాశమైలారం(Pashamylaram) పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలిని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇతర నాయకులతో కలిసి హరీశ్ రావు సోమవారం పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Pasha mylaram | ఇంత వైఫల్యమా?
ప్రమాద ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని హరీశ్ రావు విమర్శించారు. ఇంత పెద్ద పేలుడు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగే సమయంలో కంపెనీలో మొత్తం 140 మంది పని చేస్తున్నట్లు తెలుస్తున్నదన్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, మొత్తం నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిందని, దాదాపు 26 మందిని పలు ఆస్పత్రులకు తరలించారన్నారు. మిగతా వారి పరిస్థితి తెలియరావడం లేదు. ఎంత మంది బయటికి రాగలిగారనేది అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్పారు. కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చెందుతున్నారని, తమవారి జాడ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్, ఎస్పీకి చెప్పామన్నారు.
Pasha mylaram | ఎందుకింత నిర్లక్ష్యం..
ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కంట్రోల్ రూం(Control Room) పెట్టండి, కామన్ ఫోన్ నెంబర్ పెట్టండి అని అధికారులకు సూచించినా పట్టించుకోలేదన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ వెతికేందుకు ఎన్డీఆర్ఎఫ్ అద్బుతంగా పని చేస్తున్నదని.. కానీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఇర్రెస్పాన్సిబుల్గా పని చేస్తున్నదని ఆరోపించారు. డ్యూటీలో ఎంత మంది ఉన్నరు అంటే కలెక్టర్ ఒక లెక్క, ఎస్పీ ఒక లెక్క చెబుతున్నారని.. 5 గంటల నుంచి ఏ వివరాలు లేవు, ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగ పని చేస్తున్నదని విమర్శించారు.
Pasha mylaram | అన్నింట్లోనూ ఫెయిల్
మొదటి గంటలో ట్రీట్మెంట్ అందితే ప్రాణాలు కాపాడవచ్చు. కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోల్డెన్ అవర్ మిస్ చేస్తున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడంలో ఫెయిల్. కుటుంబాలకు సమాచారం అందించడంలోనూ ఫెయిల్. ఎంత మంది డ్యూటీలో ఉన్నారో గుర్తించడంలో ఫెయిల్ అని విమర్శించారు. పారిశ్రామిక వాడలో వరుసగా ఇది మూడో సంఘటన. గతంలో జరిగిన సంఘటనలో ఐదుగురు చనిపోయారని, వరుస అగ్రి ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని’ ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్ అయిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు.