అక్షరటుడే, వెబ్డెస్క్ : Medigadda | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గురువారం చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram project) కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda barrage) పగుళ్లకు కాంగ్రెస్ వాళ్లే కారణం కావొచ్చని ఆరోపించారు. వాళ్లే బాంబులు పెట్టి ప్రాజెక్ట్ పేల్చి ఉంటారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యారేజీలో కేవలం రెండు చోట్ల పగుళ్లు వస్తే.. ఏదో అయిపోయినట్టు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వాళ్లే బాంబులు పెట్టి ఉంటారని ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో అసలు నిందితులు ఎవరో తేల్చడానికి కేసు సీబీఐకి అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Medigadda | గతంలోనే కేసు నమోదు
బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజి (Medigadda barrage) కుంగిపోయింది. ఎన్నికల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలోనే నీటిపారుదల శాఖ ఏఈఈ రవికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ శబ్ధంతో పిల్లర్లు కుంగిపోపయాయని, దీని వెనక ఏవైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయోమోనని ఆయన మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో (Mahadevpur police station) ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ (KTR) సైతం అలాంటి వ్యాఖ్యలే చేయడంతో ప్రభుత్వం సీబీఐ విచారణ (CBI inquiry) అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Medigadda | కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్ట్లో (Kaleshwaram project) అక్రమాలు, మేడిగడ్డ కుంగిన విషయమై ఇప్పటికే ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ (Justice Ghosh Commission) ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ విచారణ ఇంకా కొనసాగుంది. ఇటీవల కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో (KCR) పాటు, మాజీ మంత్రులు హరీశ్రావు (Harish Rao), ఈటల రాజేందర్కు (Etela Rajender) నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ వైపు కమిషన్ విచారణ సాగుతుండగా.. సీబీఐకి (CBI) కేసు అప్పగించవచ్చా లేదా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అసలు దోషులు ఎవరో తేల్చడానికి సీబీఐ విచారణ (CBI inquiry) అయితే బాగుంటుందని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.