అక్షరటుడే, వెబ్డెస్క్ : Property Registration | ఆస్తుల రిజిస్ట్రేషన్ (Property Registration ) ప్రస్తుతం పెద్ద ప్రక్రియ. ఏ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే.
సబ్ రిజిస్ట్రార్(Sub Registrar) ఆఫీసుల్లోకి నేరుగా వెళితే పనులు కాని పరిస్థితి. డాక్యుమెంట్ రైటర్లను వెంట పెట్టుకొని వెళ్లి.. చేతులు తడిపితే గానీ రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ఇలాంటి బాధలకు చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇంటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకునేలా కొత్త చట్టం తీసుకురానుంది. దేశవ్యాప్తంగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ విధానం property registration at online అందుబాటులోకి తీసుకు రావాలని కేంద్రం యోచిస్తోంది.
Property Registration | 1908 చట్టంలో మార్పు
ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ల చట్టం 1908 నాటిది. బ్రిటిష్ కాలంలో రూపొందించిన ఈ చట్టాన్ని మార్చాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ల (Registrations) కోసం చట్టాలను మార్చాయి. తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ గతంలోనే తహశీల్దార్లకు అప్పగించారు. ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింక్ (slot booking) విధానం కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు.
ఈ క్రమంలో కేంద్రం కూడా పాత చట్టాన్ని మార్చాడానికి కొత్త ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ చట్టం అమలులోకి వస్తే.. దరఖాస్తుదారు ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లో నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఈజీగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం ప్రాపర్టీ ఈ-సర్టిఫికేట్లను పొందొచ్చు. పవర్ ఆఫ్ అటార్నీ, సేల్ సర్టిఫికేట్, ఈక్విటబుల్ మార్ట్గేజ్ వంటి డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయడం తప్పనిసరి కానుంది.
Property Registration | ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం
ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ చట్టాన్ని మార్చడానికి కేంద్రం ప్రజాభిప్రాయ (Public opinion) సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ చట్టం అమలు విషయాలు ఆయా రాష్ట్రాలు కేంద్రంతో సంప్రదింపులు జరిపి తమ రాష్ట్ర చట్టాల్లో మార్పులు చేసుకోవచ్చు. కాగా.. కొత్త చట్టం కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూ వనరుల విభాగం మే 27న ముసాయిదాను విడుదల చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా జూన్ 27లోగా తమ అభిప్రాయాలను తెలిపాల్సిందిగా కేంద్రం కోరింది.
Property Registration | ఆధార్ కార్డుతో..
ప్రస్తుతం అన్నింటికి ఆధార్ కార్డు(Aadhar card) తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఆన్లైన్ ఆధార్ కార్డు ద్వారానే చేపట్టనున్నారు. ఆన్లైన్లో డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అవినీతి, మోసాల నివారణ కోసం ఆధార్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను తీసుకు రానున్నారు. ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాగా ఈ ముసాయిదా బిల్లుపై ప్రజల అభిప్రాయలు సేకరించిన అనంతరం కేంద్రం పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందింతే ఈ చట్టం అమలులోకి వస్తుంది.