అక్షరటుడే, వెబ్డెస్క్ : MSP Hike | రైతులకు కేంద్ర ప్రభుత్వం (Central Govy) గుడ్ న్యూస్ చెప్పింది. పంటల మద్దతు ధర(MSP) పెంచుతు కేంద్ర కేబినెట్ (Union Cabinet) నిర్ణయం తీసుకుంది.
ప్రధాని మోదీ(PM Modi) అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో వరి(Paddy)తో సహా 14 పంటల మద్దతు ధర పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్ ధర రూ.2,320 ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ.69 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరి ఏ గ్రేడ్ రకం ధర క్వింటాల్కు రూ.2,389 కానుంది.
Union Cabinet | ఏటా ధర పెంపు
కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండటానికి ఏటా పంటల మద్దతు ధరను పెంచుతుంది. వానాకాలం సీజన్ ప్రారంభంలో ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటుంది. ఈ ధర వానాకాలం, యాసంగి సీజన్లకు అందుబాటులో ఉంటుంది. కాగా.. బుధవారం కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Minister Aswini vaishnav) మీడియాకు వెల్లడించారు. గత పదేళ్లుగా ఖరీఫ్ పంటలకు మద్దతు ధర భారీగా పెంచినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే తాజాగా ఎంఎస్పీ పెంపును కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందన్నారు.
ఆయా పంటలకు మద్దతు ధర కోసం రూ.2.7లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ (Interest Subsidy) కింద రూ.15,642 కోట్లతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50శాతం మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.
Union Cabinet | ధరలు ఎంత పెరిగాయంటే..
మొత్తం 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వరి సాధారణ, ఏ గ్రేడ్ ధాన్యం రేటు క్వింటాల్కు రూ.69 పెంచాలని నిర్ణయించింది. దీంతో సాధారణ రకం ధర క్వింటాల్కు రూ.2,369, ఏ గ్రేడ్ ధాన్యం ధర రూ.2,389 కానుంది. జొన్నలు క్వింటాల్కు రూ.328 పెంచింది. సజ్జల ధర రూ.150, రాగులు రూ.596, మొక్కజొన్న రూ.175, పెసర రూ.86, కందిపప్పు రూ.450, వేరుశెనగ రూ.480, మినుములు రూ.400, పొద్దుతిరుగుడు రూ.441, కుసుమలు రూ.579, సోయాబీన్ రూ.436, వలిశలు (గడ్డినువ్వులు) రూ.820, పత్తి రూ.589 చొప్పున కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Union Cabinet | బద్వేల్– నెల్లూరు రోడ్డుకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వం ఏపీలోని బద్వేల్- నెల్లూరు(Badwel- Nellore) మార్గంలో నాలుగు వరుసల రహదారి అభివృద్ధికి ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108 కిలోమీటర్ల పొడవున రోడ్డు వేయనున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోమీటర్లు తగ్గనుంది.