అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala | తిరుమల (Tirumala)లో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ వాహనదారులు వారి నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాల దోపిడీపై ఇప్పటికే భక్తులు టీటీడీ (TTD)కి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఉచిత ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించింది.
Tirumala | మొదటి దశలో 150 బస్సులు
టీటీడీ ఇప్పటికే భక్తుల కోసం ధర్మరథాలు(ఉచిత బస్సులు) నడుపుతోంది. పరిమిత సంఖ్యలో ఎలక్ట్రానిక్ బస్సులను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసింది. ఇందులో ఉచిత ప్రయాణం చేయొచ్చు. అయితే భక్తుల రద్దీకి అవి సరిపోవడం లేదు. దీంతో ప్రైవేట్ వాహనాల వారు శ్రీవారి భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో టీటీడీ ఆర్టీసీ (APS RTC)తో చర్చించి ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
తిరుపతి -తిరుమల మధ్య తిరిగే బస్సులతో పాటు.. తిరుమలలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు వెళ్లాలనుకునే భక్తులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. గురువారం ఆయన ఉచిత బస్సులను ప్రారంభించారు. ఈ సేవల్లో భాగంగా మొదటి దశలో దాదాపు 150 బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
Tirumala | ఆ మార్గాల్లో..
ప్రయివేట్ వాహనాల దోపిడీని అరికట్టి, కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అదనపు ఈవో తెలిపారు. ఉచిత బస్సులపై తమ విజ్ఞప్తికి స్పందించి ఏపీఎస్ ఆర్టీసీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి ధర్మ రథాలు (Dharma Rathalu) తిరిగే మార్గంలోనే ఉచిత ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతాయని తెలిపారు. శ్రీవారి మెట్టు, పాపవినాశనం, ఆకాశ గంగ, శ్రీవారి ఆలయం, టీటీడీ కాటేజీలు, అన్నదాన సత్రం, జీఎన్సీ టోల్ గేట్, బస్టాండు-సీఆర్వో ఆఫీసు మధ్య ఈ ఉచిత బస్సులు సేవలు అందజేస్తాయని ఆయన వివరించారు.