అక్షరటుడే, వెబ్డెస్క్: DoT | సెల్ఫోన్ వినియోగదారులకు (Mobile Customers) మరింత మెరుగైన సేవలందించేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగానే మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ పెయి డ్(postpaid to prepaid)కు, ప్రీ పెయిడ్ నుంచి పోస్టు పెయిడ్కు మారే నిర్దేశిత గడువును తగ్గించింది.
గతంతో 90 రోజులు కూలింగ్ పీరియడ్ ఉండగా, ప్రస్తుతం దాన్ని 30 రోజులకు తగ్గించింది. దీంతో Jio, Airtel, BSNL, Vi వినియోగదారులు ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్ల మధ్య మారడం చాలా సులభమవుతుంది. టెలికమ్యూనికేషన్ల విభాగం (Telecommunications Department) తీసుకున్న తాజా నిర్ణయంతో 90 రోజుల సుదీర్ఘ నిరీక్షణను భరించే రోజులు పోయాయి. లక్షలాది మంది మొబైల్ వినియోగదారుల కోసం DoT ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించింది. దీని వలన వారు తమ కనెక్షన్లను మరింత సులభంగా మార్చుకోవచ్చు. వినియోగదారులు ఇప్పుడు OTP-ఆధారిత KYC ధ్రువీకరణను ఉపయోగించి ప్రీపెయిడ్ నుండి పోస్ట్పెయిడ్కు లేదా పోస్టు పెయిడ్ నుంచి ప్రీ పెయిడ్కు సులభంగా మారవచ్చు.
DoT | ఓటీపీ ఆధారంగా..
మొబైల్ వినియోగదారులు మునుపటి 90-రోజుల వెయిటింగ్ పీరియడ్ కు బదులు కేవలం 30 రోజుల్లోపు తమ నంబర్లను సౌకర్యవంతంగా మార్చుకోవచ్చని DoT తెలిపింది. ఓటీపీ ఆధారిత కేవైసీ ప్రక్రియ ద్వారా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ పెయిడ్కు, ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కు మారొచ్చని పేర్కొంది. ఈ కొత్త విధానంతో, వినియోగదారులు తగ్గిన నిరీక్షణ సమయం నుంచి ప్రయోజనం పొందుతారు.
DoT | మొదటిసారి మార్పిడికి మాత్రమే..
ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ సేవల మధ్య మారాలనుకునే లెక్కలేనన్ని మొబైల్ వినియోగదారులకు నూతన విధానం నిస్సందేహంగా సహాయపడుతుంది. అయితే, ఈ పరిమితి మొదటిసారి మార్పిడికి మాత్రమే వర్తిస్తుందని టెలికమ్యూనికేషన్ల శాఖ తెలిపింది. ఒక సబ్స్క్రైబర్ వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ఉపయోగించి పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ పెయిడ్కు లేదా ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కు మారొచ్చు. ఆ తర్వాత మళ్లీ మారాలనుకుంటే మాత్రం మళ్లీ 90 రోజుల పాటు నిరీక్షణ తప్పదు.