అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండి స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. అయితే స్వామి దర్శనం అనంతరం భక్తులు లడ్డూల (Laddus) కోసం కూడా బారులు తీరుతారు. ఈ క్రమంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ (TTD) కీలక చర్యలు చేపట్టింది. ఇక నుంచి కౌంటర్లతో పాటు కియోస్క్ (Kiosk)ల ద్వారా కూడా లడ్డూ టోకెన్లు అందుబాటులో ఉంచింది.
Tirumala | భక్తుల సౌకర్యార్థం
తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్లో టీటీడీ ఐదు కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేసింది. లడ్డూ కౌంటర్లలో (Laddu Counters) రద్దీని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అదనంగా లడ్డూలు కొనుగోలు చేయాల్సిన భక్తులు మొదట కౌంటర్లో టోకెన్లు తీసుకోవాలి. అనంతరం ఆ టోకెన్లు ఇచ్చి లడ్డూలు పొందాల్సి ఉంది. అయితే టోకెన్లు తీసుకునే సమయంలో రద్దీ అధికం అవుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం టోకెన్ల కోసం తాజాగా కియోస్క్లను అధికారులు ఏర్పాటు చేశారు.
Tirumala | 15 లడ్డూలు పొందవచ్చు
భక్తులు దర్శన టికెట్లు, టోకెన్లపై ఉండే నంబర్ను ఈ కియోస్క్లో నమోదు చేసి 15 లడ్డూల వరకు పొందవచ్చు. టికెట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత లడ్డూల సంఖ్య నమోదు చేయాలి. అనంతరం అక్కడ కనిపించే క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా పేమేంట్ చేస్తే లడ్డూ టోకెన్లు వస్తాయి. వాటిని కౌంటర్లో ఇచ్చి లడ్డూలు పొందవచ్చు. ఎలాంటి దర్శన టోకెన్లు, టికెట్లు లేని భక్తులైతే తమ ఆధార్ నంబర్ను నమోదు చేసి రెండు లడ్డూలు పొందవచ్చు. భవిష్యత్ వీటి సంఖ్యను నాలుగు పెంచుతామని టీటీడీ అధికారులు తెలిపారు.
లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఐదు కియోస్క్లను అధికారులు ఏర్పాటు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో మూడింటిని ఏర్పాటు చేశారు. ఇవి విజయవంతం అయితే మరికొన్ని ఏర్పాటు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గతంలో కియోస్క్ల ద్వారా విరాళాలు అందించే విధానాన్ని ప్రారంభించిన టీటీడీ తాజాగా లడ్డూ టోకెన్ల జారీ కోసం కూడా వాటిని ఏర్పాటు చేసింది.