అక్షరటుడే, వెబ్డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్ (Kondapur Flyover) శనివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఐటీ కారిడార్ అయిన గచ్చిబౌలి–కొండాపూర్ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. దీంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు.
ఈ క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం గతంలోనే ఇక్కడ రెండు ఫ్లై ఓవర్లు నిర్మించింది. ప్రస్తుతం అవి అందుబాటులో ఉండగా.. తాజాగా గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు మరో ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయింది. దీనికి మాజీ మంత్రి, కార్మిక నాయకుడు పీ జనార్దన్రెడ్డి (PJR) పేరు పెట్టారు. ఈ ఫ్లై ఓవర్ను శనివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు.
PJR Flyover | రూ.182 కోట్లతో నిర్మాణం
నగర వాసుల ముఖ్యంగా ఐటీ కారిడార్ (IT Corridor)లో ప్రయాణించే వారి సౌకర్యార్థం ప్రభుత్వం ఈ ఫ్లై ఓవర్ నిర్మించింది. SRDP కింద రూ.182.72 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్తో ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. 1.2 కి.మీ పొడవు 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో దీనిని నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే ఔటర్ రింగ్రోడ్డు నుంచి కొండాపూర్, హాఫీజ్పేట్ మార్గాల్లో వెళ్లేవారికి సమయం ఆదా కానుంది. కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) వేగంగా చేరుకోవచ్చు.