అక్షరటుడే, వెబ్డెస్క్: Global Warming | గ్లోబల్ వార్మింగ్(Global Warming) వలన రోజురోజుకు ప్రపంచం వేడెక్కుతోంది. దీని వలన భవిష్యత్లో వాతావరణ సంక్షోభం (Climate crisis) మాత్రమే కాకుండా మానవ ఆహార సంక్షోభానికి కూడా దారితీసే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘నేచర్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. ప్రపంచ ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ సెల్సియస్ పెరిగితే, ప్రతి ఒక్కరికీ లభించే రోజువారీ ఆహారంలో సగటున 120 క్యాలరీలు తగ్గిపోతాయి. ఇది సుమారు 4.4 శాతం ఆహార లోటు అన్నమాట. శతాబ్దం చివరికి ఇది మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ముఖ్యమైన ధాన్యాల నుంచి వచ్చే క్యాలరీలు సగటున 24 శాతం వరకు తగ్గవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే ఆకలితో బాధపడుతున్న కోట్లాది మందికి ఇది మరింత సంక్షోభాన్ని తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరిశోధనను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సహా అనేక గ్లోబల్ రీసెర్చ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ప్రొఫెసర్ సోలమన్ హ్సియాంగ్ (Professor Solomon Hsiang) మాట్లాడుతూ.. భవిష్యత్లో ఉష్ణోగ్రతలు(Temperatures) మూడు డిగ్రీలు పెరిగితే, అప్పుడు ప్రపంచం మొత్తం ఒక పూట భోజనం మానేయాల్సి వస్తుందని అన్నారు. ఈ ప్రభావం అత్యధికంగా తక్కువ ఆదాయ దేశాలు, పేదలపై ఉంటుందని, ఇప్పటికే పోషకాహారం లోపంతో బాధపడుతున్న 80 కోట్ల మంది పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉందన్నారు.
వాతావరణ మార్పులు (Climate Change), ఉష్ణోగ్రత పెరుగుదల (Temperature Rise), అస్థిర వర్షపాతం, వేడిగాలుల తీవ్రత, నేల తేమ తగ్గుదల వంటి కారణాల వల్ల పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా మిడ్వెస్ట్.. మొక్కజొన్న, సోయాబీన్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం అత్యంత ప్రభావితమైన ప్రాంతంగా మారే ప్రమాదముంది. అయితే చల్లని దేశాలైన కెనడా, రష్యా, చైనాలో కొంత ఉపశమనం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. 2025 నాటికే ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల పంట ఉత్పత్తి 8 శాతం తగ్గే అవకాశముంది. కార్బన్ ఎమిషన్లు తగ్గినా, పెరిగినా వాతావరణంలో ఇప్పటికే చేరిపోయిన హానికర వాయువుల ప్రభావం వల్ల ఇబ్బందులు తప్పవంటున్నారు. వాతావరణ అనుకూల వ్యవసాయ సాంకేతికత, నిధులు సమకూర్చడం, ప్రభుత్వ సహాయంతో రైతులకు మద్దతు ఇచ్చినట్లయితే కాస్త నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook‘