అక్షరటుడే, వెబ్డెస్క్: Shamshabad Airport | హైదరాబాద్ (Hyderabad)లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. దేశంలోని కీలక ఎయిర్పోర్టులలో ఇది ఒకటి. శంషాబాద్లో ఉన్న ఈ విమానాశ్రయంపై ఇటీవల సోషల్ మీడియా (Social Media)లో రుమార్లు వినిపించాయి. ఎయిర్పోర్టులో అతీంద్రియ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. దీనిపై విమానాశ్రయ అధికారులు స్పందించారు. ఆ రుమార్లను కొట్టిపారేశారు.
Shamshabad Airport | అసలు ఏం జరిగిందంటే..
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) అతీంద్రియ కార్యకలాపాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణ సమయంలో సమాధులను సరిగ్గా తరలించకపోవడంతో ఆత్మలు టెర్మినల్ (Terminal)ను వెంటాడతాయని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అయింది. అనంతరం పుకార్లు ప్రారంభమయ్యాయి. దీంతో పలువురు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అసలే అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో ఆందోళనలో ఉన్న ప్రయాణికులను ఈ పుకార్లు మరింత భయపెట్టాయి.
ఈ పుకార్లపై తాజాగా RGIA అధికారులు స్పందించారు. ఈ వాదనలు అబద్దం అని కొట్టి పారేశారు. తప్పుదారి పట్టించేవి, కల్పిత కంటెంట్ ఆధారంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందొద్దని ప్రయాణికులను కోరారు. అలాగే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని నమ్మొద్దని సూచించారు.
కాగా ఎయిర్పోర్టులో ఆత్మలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. ఈ కాలంలో దెయ్యాలెంటి బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. వ్యూస్ కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే వీడియోలు చేయొద్దని హితవు పలికారు. ఇలా తప్పుడు వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.