అక్షరటుడే, వెబ్డెస్క్ : Gandhi Grand Daugter | మనదేశంలో మహత్మా గాంధీని (Mahatma Gandhi) ఎంత గొప్పగా ఆరాధిస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గాంధీజీ కుటుంబీకులు సైతం తమ సామాజిక సేవలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. భారత్, దక్షిణాఫ్రికాల నుంచి పలు గౌరవ సత్కారాలను అందుకున్నారు. కాగా.. గాంధీజీ మునిమానువరాలు ఆశిష్ లతా మాత్రం మోసపూరిత కేసులో దోషిగా తేలి జైలు పాలయ్యారు. సౌతాఫ్రికాలో ఉండే మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్గోబిన్(56)కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు డర్బన్లోని స్పెషలైజ్డ్ క్రైమ్ కోర్టు తీర్పు వెలువరించింది. లతా రామ్గోబిన్ (Lata Ramgobind) ఎస్ఆర్ మహరాజ్ అనే వ్యాపారవేత్తను 6 మిలియన్ రాండ్స్ (రూ. 3.22 కోట్లకు) మోసం చేసిన కేసులో ఈ శిక్ష పడింది. అయితే నేరం రుజువు అయిన క్రమంలో అప్పీలు చేసుకునే అవకాశాన్నీ కోర్టు నిరాకరించింది.
Gandhi Grand Daugter | ఏం చేసింది అంటే..
లతా రామ్గోబిన్ (Lata Ramgobind) ఒక ఎన్జీఓ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తూ తన పలుకుబడిని ఉపయోగించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్గా ఉన్న మహారాజ్ను లత డబ్బులు అడిగారు. దీనికోసం లతా రామ్గోబిన్ తాను భారత్ నుంచి మూడు కంటైనర్ల ‘లైనెన్’ దిగుమతి చేసుకుంటున్నానని వాటిని దక్షిణాఫ్రికాలోని ప్రైవేట్ హెల్త్కేర్ గ్రూప్ నెట్కేర్కు పంపుతానని నమ్మబలికారు. అయితే మహారాజ్ను నమ్మించడానికి లతా రామ్గోబిన్ కొన్ని నకిలీ పత్రాలు చూపించారు. వాటిలో సంతకం చేసిన పర్చేజ్ ఆర్డర్, ఇన్వాయిస్, నెట్కేర్ నుంచి డెలివరీ నోట్ ఉన్నాయి.
లతా రామ్గోబిన్ ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమార్తె కావడంతో మహారాజ్ సహాయం చేయడానికి అంగీకరించారు. తనకు లాభాలలో వాటా వస్తుందని ఆశించారు. ఆ పత్రాలన్నీ నకిలీవని తర్వాత తేలింది. దీంతో మహారాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ సమయంలో నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ (NPA) బ్రిగేడియర్ హంగ్వాని ములాడ్జీ మాట్లాడుతూ.. లతా రామ్గోబిన్, తాను అల్లిన కథను నిజమని నమ్మించడానికి నకిలీ పత్రాలు సృష్టించిందని చెప్పారు. దీంతో కోర్టు ఆమెను దోషిగా తేల్చి అప్పీల్ చేయడానికి చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించింది.