అక్షరటుడే, వెబ్డెస్క్ :Loan Waiver | రుణమాఫీ పేరిట రైతులను (Farmer crop loans) మోసం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ (Police Arrest) చేశారు.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రూ.రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రూ.రెండు లక్షలపైన లోన్ ఉన్న వారికి రుణమాఫీ కాలేదు. అలాగే రూ.రెండు లక్షల లోపు ఉన్నవారిలో కూడా పలువురికి రుణమాఫీ కాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారికి తాము రుణాలు మాఫీ చేయిస్తామని ఓ ముఠా మోసాలకు పాల్పడుతోంది.
ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లో పలువురు మోసగాళ్లు గ్రామాలకు తిరుగుతూ రుణమాఫీ (Loan waiver) చేయిస్తామని రైతులను నమ్మిస్తున్నారు. రైతులు ప్రతి సంవత్సరం బ్యాంకు నుంచి రుణం తీసుకొని సకాలంలో చెల్లిస్తే, తిరిగి 20-30 శాతం అధిక రుణం పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనిని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు లోన్ మాఫీ చేయిస్తామని రైతులకు చెబుతున్నారు. తీరా పాత రుణాన్ని వారే కట్టి కొత్తగా అధికంగా రుణం తీసుకుంటున్నారు. ఇందుకు గాను రైతుల నుంచి రూ. పది వేల వరకు కమీషన్ తీసుకుంటున్నారు. అయితే రుణమాఫీ అయిందనుకొని రైతులు వారికి కమీషన్ ఇస్తున్నారు.
Loan Waiver | ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ..
రుణమాఫీ పేరిట రైతులను మోసం చేస్తున్న విషయం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ (Adilabad SP Akhil Mahajan) దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన పోలీసు సిబ్బందిని రైతుల వేషంలో బ్యాంకు(Bank)కు పంపించారు. రైతుల వేషంలో ఉన్న పోలీసులతో మోసగాళ్లు మంతనాలు జరపడంతో నిందితులను పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, నార్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, బేల, తలమడుగు, బీంపూర్, మావల, ఇంద్రవెల్లి మండలాల్లో రైతులను మోసం చేస్తున్న 34 మంది కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల బ్యాంకు అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.