అక్షరటుడే, వెబ్డెస్క్: Formula E car race | ఫార్ములా ఈ–కారు రేస్ కేసులో కేటీఆర్కు (KTR) మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. రెండోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ (ACB) శుక్రవారం నోటీసులిచ్చింది. ఫార్ములా ఈ–కారు రేస్ కేసులో సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. అయితే, ఇందులో అక్రమాలు జరిగాయని, అనుమతి లేకుండా నిధులు విడుదల చేశారనే అభియోగంపై ఏసీబీ విచారణ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి గత నెల మే 28న విచారణకు హాజరుకావాల్సిందిగా ఏసీబీ కేటీఆర్కు నోటీసులు పంపింది. అయితే ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగిసిన తర్వాత విచారణకు హాజరువుతానని ఏసీబీకి మాజీ మంత్రి సమాచారం ఇచ్చారు. అందుకు అంగీకరించిన అవినీతి నిరోధక శాఖ.. శుక్రవారం మరోసారి కేటీఆర్కు నోటీసులు పంపింది.
Formula E car race | గతంలో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ఫార్ములా-ఈ కార్ రేసు (Formula E car race) వ్యవహారంలో ఉల్లంఘనలు జరిగాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం (state governmen) విచారణకు ఆదేశించారు. పోటీ నిర్వహణ సంస్థకు ఏకపక్షంగా చెల్లింపులు జరగడం, రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నిధుల బదిలీ చేయడంతో విచారణ చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏసీబీకి లేఖ రాయడంతో కేసును అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Department) విచారిస్తోంది.
Formula E car race | 2023లో పోటీలు
2023 సంవత్సరంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో (Hyderabad) ఫార్ములా–ఈ కార్ రేసు పోటీలు జరిగాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల ట్రాక్లో 2023 ఫిబ్రవరి 10,11 తేదీల్లో మొదటి ఫార్ములా-ఈ కార్ రేసు జరిగింది. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా అభిమానులు హాజరయ్యారు. దీంతో 2024 ఫిబ్రవరి 10న మరో మారు నిర్వహించాలని భావించారు. అయితే 2023 డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలోకి వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకొంటున్నట్లు అదే నెలలో ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ప్రకటించింది.