అక్షరటుడే, వెబ్డెస్క్:Srisailam Project | కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద భారీగా వస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీరు వస్తోంది. మహారాష్ట్రలోని ఉజని డ్యాం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్(Jurala Project)కు గురువారం, శుక్రవారం భారీగా వదర వచ్చి చేరింది. దీంతో అధికారులు గేట్లు, ఎత్తి విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని వదిలారు. ఆ నీరు శ్రీశైలం ప్రాజెక్ట్(Srisailam Project)కు చేరుతోంది. శుక్రవారం సాయంత్రం వరకు గేట్ల ద్వారా జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రికి ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసి వేశారు. అయితే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 24,931 క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.
Srisailam Project | 39.5 టీఎంసీల నీరు
శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా శనివారం ఉదయానికి 39.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంలోకి 59,398 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. జూరాల గేట్లు మూసివేయడంతో ఇన్ఫ్లో తగ్గే అవకాశం ఉంది. అయితే మరోవైపు కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర ప్రాజెక్టు(Tungabhadra Project)కు వరద చేరుతున్నది.